రెండో రోజు విచారణకు తహసీల్దార్

by  |
రెండో రోజు విచారణకు తహసీల్దార్
X

దిశ, క్రైమ్ బ్యూరో: షేక్‌పేట భూవివాదంలో ఏసీబీకి పట్టుబడ్డ ఆర్ఐ కేసులో తహసీల్దార్ చింతల సుజాత ఏసీబీ విచారణకు రెండో రోజు హజరయ్యారు. షేక్‌పేట మండలం మీరాలం మండీకి చెందిన అబ్దుల్ ఖలీద్ ఫిర్యాదు మేరకు శనివారం ఆర్ఐ నాగర్జున రెడ్డి రూ.15 లక్షలు లంచం తీసుకుంటుండుగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇదే సమయంలో గాంధీనగర్‌లోని తహసీల్దార్ నివాసంలో సోదాలు నిర్వహించగా రూ.30 లక్షల నగదుతో పాటు బంగారం, ఇతర విలువైన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తహసీల్దార్ ప్రమేయంపై శనివారం రాత్రి 12 గంటల వరకూ విచారించారు. విచారణ నిమిత్తం ఆదివారం నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని చెప్పి, శనివారం రాత్రి తహసీల్దార్‌ను ఇంటికి పంపించారు. దీంతో ఆదివారం ఉదయం 11 గంటలకు తహసీల్దార్ సుజాత ఏసీబీ కార్యాలయానికి హజరయ్యారు. ఆమెను సాయంత్రం వరకూ విచారించిన ఏసీబీ అధికారులకు, తన ఇంట్లో లభ్యమైన డబ్బు గురించి మొదటగా నోరు విప్పని తహసీల్దార్ తర్వాత వీర్వో ఖలీద్, ఆర్ఐ నాగర్జునరెడ్డి ద్వారా డీల్ నడిపినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించించారు. సుజాత ఇంట్లో లభ్యమైన పత్రాల్లో బంజారాహిల్స్‌లోని పలు స్థలాలకు సంబంధించిన పత్రాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో తహసీల్దార్ సుజాతకు కూడా ప్రమేయం ఉన్నట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ఆర్ఐ నాగర్జున రెడ్డికి, బంజారాహిల్స్ ఎస్ఐ రవీంద్రకు ప్రత్యక్షంగా సంబంధం ఉన్నట్టు ఏసీబీ తేల్చింది. అయితే, తహసీల్దార్‌ సుజాతకు మెజిస్ట్రేట్ హోదా కలిగి ఉండడంతో అరెస్టు చేస్తారో.. లేదో తేలాల్సి ఉంది.

Next Story

Most Viewed