లైన్‌మెన్‌గా మారిన సర్పంచ్.. ప్రజల కోసమే ఇదంతా అంటూ..!

by  |
లైన్‌మెన్‌గా మారిన సర్పంచ్.. ప్రజల కోసమే ఇదంతా అంటూ..!
X

దిశ, దౌల్తాబాద్ : అతనో గ్రామ సర్పంచ్. మండల సీనియర్ నాయకులు. అయినా తన ఊరి కోసం, గ్రామస్తుల ఇబ్బందులు తీర్చేందుకు కంకణం కట్టుకున్నారు. గ్రామంలో చీకటిని తొలగించేందుకు ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా స్వయంగా తానే స్ట్రీట్ లైట్లు కొనుగోలు చేసి విద్యుత్ స్తంభం ఎక్కి లైట్లను బిగించారు. దౌల్తాబాద్ మండలం కొత్తగా ఏర్పడిన మల్లేశంపల్లి గ్రామ చౌరస్తాలో బుధవారం సర్పంచ్ విద్యుత్ స్తంభం ఎక్కి లైట్లను బిగిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

సాధారణంగా సర్పంచులు తమ సిబ్బందితో పనులు చేయిస్తుంటే.. మల్లేశంపల్లి సర్పంచ్ సత్యనారాయణ ఏకంగా తానే స్తంభం ఎక్కి లైట్లను అమర్చడం హర్షనీయమని ఆయన సేవలను కొనియాడుతున్నారు. బతుకమ్మ సంబురాలు విజయవంతంగా నిర్వహించేందుకు, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నట్టు సర్పంచ్ దారా సత్యనారాయణ తెలిపారు. గ్రామ సర్పంచ్‌గా తనను గెలిపించిన వారి రుణం తీర్చుకోవడానికి ఇది సరైన సమయమని, ఈ పనుల్లో పెద్ద కష్టం ఏమీ కాదని చెబుతున్నారు సర్పంచ్. గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్నా సర్పంచ్ ముందుండి పనులు చేయిస్తుండటంతో గ్రామస్తులు ఆయన సేవలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story