ప్రతీ పనిలో ‘పైసా వసూల్’.. అవినీతి ఎంపీవోను తప్పించండి

by  |
ప్రతీ పనిలో ‘పైసా వసూల్’.. అవినీతి ఎంపీవోను తప్పించండి
X

దిశ, పాల్వంచ : పాల్వంచ మండల పంచాయతీ అధికారి బద్ది రామకృష్ణ పలు అవినీతి ఆరోపణలకు కేంద్ర బిందువుగా నిలిచారు. ఇటీవల కాలంలో వైస్ ఎంపీపీ నేతృత్వంలో సర్పంచులు, జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులను కలిసి ఎంపీవో అవినీతిపై బాహాటంగా ఫిర్యాదు చేశారు. తాజాగా సర్పంచుల సంఘ కార్యదర్శి పాండు రంగపురం సర్పంచ్ అజ్మీర జగదీష్ బుధవారం పలు ఆరోపణలు గుప్పించారు. ఎంపీవో అవినీతిపై ఎంపీడీఓ రవీంద్ర ప్రసాద్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ పేపర్లను జిల్లా కలెక్టర్, జడ్‌పీ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారులకు పంపినట్లు చెప్పారు. ఫిర్యాదుల పరంపర ఇలా ఉంది. మండల వ్యాప్తంగా 36 పంచాయతీలలో ట్రాక్టర్, ట్రక్ కొనుగోలులో ఎంపీవో చేతివాటం ప్రదర్శించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నాసిరకం బ్లీచింగ్ కొనుగోలుతో నిధుల దుర్వినియోగం, సర్పంచుల ప్రమేయం లేకుండా ఫాగింగ్ మిషన్ తక్కువ రేట్‌కు కొనుగోలు చేసి అధిక మొత్తంలో నిధులు డ్రా చేయడం, ఆంధ్రా ప్రాంతం నుంచి తక్కువ ధరకు మొక్కలు కొనుగోలు చేసి అధిక మొత్తంలో పంచాయతీల నుంచి వసూలు, ఇంజినీరింగ్ అధికారి అభివృద్ధి పనులకు సంబంధించి ఎంబీఐ చెక్ తయారు చేశారు. తన ప్రమేయం లేకుండా సర్పంచులకు ఇవ్వొద్దని నిలుపుదల చేయించడం, ప్రశ్నించే ప్రజాప్రతినిధులను కక్ష గట్టి తన దారికి తెచ్చుకోవడం, నేను ఉన్నతాధికారులకు ఎంత చెబితే అంత అంటూ బెదిరింపులకు పాల్పడటం తదితర అంశాలపై సమగ్ర పరిశీలనతో చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ ఎంపీఓను తక్షణం విధుల నుండి తొలగించాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed