ప్రశాంత్ భూషణ్‌కు కోర్టు ధిక్కరణనోటీసులు

by  |
ప్రశాంత్ భూషణ్‌కు కోర్టు ధిక్కరణనోటీసులు
X

న్యూఢిల్లీ : సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు కోర్టు ధిక్కారణ నోటీసులు జారీ అయ్యాయి. న్యాయవ్యవస్థపై చేసిన తీవ్ర ఆరోపణలకు వివరణ ఇవ్వాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. భూషణ్ ట్వీట్‌ను ఎందుకు తొలగించలేదో వివరణ ఇవ్వాలని ట్విట్టర్ ఇండియాకూ సమన్లు పంపింది. కోర్టు సందేశాన్ని మాతృసంస్థ కాలిఫోర్నియాలోని ట్విట్టర్ సంస్థకు చేరుస్తామని ట్విట్టర్ ఇండియా విభాగం స్పందించింది. ప్రశాంత్ భూషణ్ చేసిన రెండు ట్వీట్లపై కోర్టు ధిక్కారణ కింద విచారణను సొంతంగా తీసుకుంది. భవిష్యత్తులో చరిత్రకారులు భారత చరిత్రను వెనక్కి చూసినప్పుడు గత ఆరేళ్లలలో ఎమర్జెన్సీ విధింపు లేకుండానే ప్రజాస్వామ్యాన్ని ఎలా ధ్వంసం చేశారో గుర్తిస్తారని, అందులోనూ న్యాయవ్యవస్థ పాత్రను ముఖ్యంగా చివరి నలుగురు ప్రధాన న్యాయమూర్తులనూ ప్రత్యేకించి తరచి చూస్తారని జూన్‌లో ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. గతనెలలో సీజేఐ ఎస్ఏ బాబ్డే హార్టీ డేవిడ్సన్ బైక్‌పై కూర్చున్న ఫొటోలపైనా ఆయన కామెంట్ చేశారు.

న్యాయాన్ని పొందే పౌరుల ప్రాథమిక హక్కును కాలరాస్తూ సుప్రీంకోర్టును లాక్‌డౌన్ మోడ్‌లో ఉంచి సీజేఐ కనీసం మాస్కు, హెల్మెట్ లేకుండా బైక్‌పై కూర్చున్నారని ట్వీట్ చేశారు. ఈ రెండు ట్వీట్లు న్యాయవ్యవస్థను ధిక్కరించేలా ఉన్నాయని భావిస్తూ జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం క్రిమినల్ కంటెంప్ట్ కింద సుమోటోగా విచారణకు స్వీకరించింది.

Next Story

Most Viewed