మౌన ప్రేక్షకుల్లా చూస్తూ కూర్చోలేం : సుప్రీం

by  |
supreme court
X

న్యూఢిల్లీ : దేశం ఆరోగ్య అత్యయిక స్థితి పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో తాము మౌన ప్రేక్షకుల్లా చూస్తూ కూర్చోలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేశంలో సర్వోన్నతన్యాయస్థానం జోక్యం చేసుకునే అంశాలు కొన్ని ఉంటాయని తెలిపింది. దేశంలోని ఆస్పత్రులలో ఆక్సిజన్ కొరత, వ్యాక్సిన్, ఔషధాల సప్లై వంటి అంశాలను సుమోటాగా స్వీకరించిన సుప్రీం ధర్మాసనం.. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ ఎల్ఎన్ రావు, జస్టిస్ రవీంద్ర భట్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేసు విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ.. జాతీయ సంక్షోభం వేళ దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించకుండా మౌన ప్రేక్షకుడిలా కూర్చోని ఉండలేదని అభిప్రాయ పడింది. ఆయా రాష్ట్రాల హైకోర్టులలో ఇదే విషయమై జరుగుతున్న విచారణను ఆపే ఉద్దేశం తమకు లేదని, అక్కడి కోర్టులే వాటిపై సరైన నిర్ణయం తీసుకుంటాయని తెలిపింది. అయితే హైకోర్టులు పరిశీలించలేని సమస్యలకు తాము (సుప్రీంకోర్టు) పరిష్కారం చూపిస్తామని ధర్మాసనం స్పష్టతనిచ్చింది. రాష్ట్రాలకు ఆక్సిజన్, ఇతర ఔషధాల సరఫరా, ఆర్మీ వంటి కేంద్ర వ‌న‌రుల‌ను వినియోగించ‌డం, వ్యాక్సిన్ల ధ‌ర‌ల‌పై స్పష్టత ఇవ్వాల‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ శుక్రవారం జరగనుంది.


Next Story

Most Viewed