తహసీల్దార్ కార్యాలయంలో యువకుడి ఆత్మహత్యాయత్నం

by  |
Suicide attempt
X

దిశ, జగదేవపూర్: ఇంటి నిర్మాణం కోసం లోన్ ఇప్పించాలని కోరుతూ అధికారుల ఎదుట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం చోటు చేసుకుంది. రెవెన్యూ అధికారులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని తీగుల్ గ్రామానికి చెందిన ఎల్లం బాలకృష్ణ (37) ఎస్సీ కార్పొరేషన్ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ మంజూరు కాలేదు. అయితే తనకు ఖాళీ స్థలంలో ఉండటంతో దాంట్లో ఇల్లు నిర్మించుకునేందుకు పర్సనల్ లేదా హౌసింగ్ లోన్ ఇప్పించాలని కోరుతూ మంగళవారం జగదేవపూర్ తహసీల్దార్ యాదగిరి రెడ్డికి దరఖాస్తు చేసుకున్నాడు.

అయితే వ్యక్తిగత, హౌసింగ్ లోన్ ఇప్పించడం తమ పరిధిలో లేదని, బ్యాంకు అధికారులను సంప్రదించాలని తహసీల్దార్ సూచించారు. దీంతో మనస్థాపం చెందిన బాలకృష్ణ లోన్ ఇప్పించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని, తనతోపాటు తెచ్చుకున్న పురుగుల మందును తాగడానికి ప్రయత్నించాడు. గమనించిన తహసీల్దార్ యాదగిరి రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ కరుణాకర్ రావు సదరు యువకుడి చేతిలో ఉన్న పురుగుల మందు డబ్బాను లాగేశారు. వెంటనే జగదేవపూర్ ఎస్ఐ పరమేశ్వర్‌కు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు బాలకృష్ణను గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


Next Story