పల్లీలు అమ్మి.. గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్‌కు ఓనర్‌గా!

by  |
పల్లీలు అమ్మి.. గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్‌కు ఓనర్‌గా!
X

దిశ, ఫీచర్స్ : ఆధునిక భావాలు గల మహిళలు, ప్రస్తుతం పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. కీలకమైన ఎంట్రప్రెన్యూర్ సెక్టార్‌లోనూ సత్తా చాటుతున్నారు. కేవలం ఉద్యోగినులుగా మిగిలిపోకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే రూ.50 పైసలతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చెన్నైకి చెందిన ఓ మహిళ.. బీచ్‌లో పల్లీలు అమ్ముకునే స్థాయి నుంచి గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్‌‌కు యజమానిగా ఎదిగింది. సమస్యలెన్ని చుట్టుముట్టినా, నేర్పుతో పరిష్కరించుకుని.. నిర్భాగ్య స్థితి నుంచి నేడు పలువురికి ఉపాధి ఇచ్చే స్థితికి చేరుకుంది. ఈ క్రమంలో సక్సెస్‌ఫుల్ ఎంట్రప్రెన్యూర్‌గా ఫిక్కీ (ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) ఉమన్ ఎంట్రప్రెన్యూర్ అవార్డును సైతం అందుకుంది. ఆత్మవిశ్వాసంతో జీవిత కష్టాలన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని నలుగురికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ఆ మహిళామూర్తి గురించి మీరూ తెలుసుకోండి.

తమిళనాడు.. నాగర్‌కోయిల్ సిటీకి చెందిన సంప్రదాయ కుటుంబంలో జన్మించిన పెట్రిసియా తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. చెన్నైలోని క్వీన్ మేరి కాలేజీలో ఇంటర్ చదువుతున్న సమయంలో నారాయణ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. మతాంతర వివాహం చేసుకుందని ఆమెను తండ్రి ఇంటి నుంచి వెలివేయగా, భర్తతో నూతన జీవితాన్ని ప్రారంభించింది. ఇద్దరు పిల్లలు పుట్టాక, జీవితం సాఫీగా సాగిపోతుందనుకున్న దశలో కష్టాలు చుట్టుముట్టాయి. తాగుడుకు బానిసైన పెట్రిసియా భర్త, ఆమెకు ఆశ్రయం కల్పించేందుకు నిరాకరించాడు. అప్పుడు ఆమె వయసు 19 ఏళ్లు మాత్రమే. ఆ సమయంలో ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకొని ఇక జీవితాన్ని కడతేర్చుకుందామని చెన్నై మెరీనా బీచ్ వైపు నడక సాగించింది. అలా సముద్రతీరంలో నడుస్తూ ఉండగా‌ అక్కడ పల్లీలు, బఠాణీలు అమ్ముతున్న వారిని చూసింది. చదువు సంధ్యల్లేని ఈ అమాయకులు కాయకష్టం చేసుకొని జీవించగలుగుతున్నప్పుడు నేను మాత్రం వారిలా ఎందుకు జీవితాన్ని సాగించలేను? అనే ఆలోచన ఆమెలో ఆశాదీపాన్ని వెలిగించింది.

అప్పటి నుంచి తల్లి సహకారంతో మెరీనా బీచ్ తీరంలో బఠాణీలు, పల్లీలు, రసాలు అమ్ముతూ కొత్త జీవితం మొదలెట్టింది. మొదటిరోజు సంపాదన కేవలం రూ. 0.50 పైసలు మాత్రమే వచ్చింది. అయినా నిరాశపడకుండా ఓర్పుతో మందుకుసాగింది. క్రమంగా ఆదాయం ఐదు, యాభై.. నుంచి రూ.100కు చేరింది. కొన్నాళ్లకు లోన్ తీసుకొని బీచ్‌లో ఓ కియోస్క్ స్టార్ట్ చేసింది. నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ వ్యాపారం సాగించడం వల్ల కొద్ది కాలంలో ఆమె వ్యాపారం పుంజుకొంది. బీచ్‌లోనే కస్టమర్లను సెర్చ్ చేసి ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోర్ట్ మేనేజ్‌మెంట్‌’తో క్యాటరింగ్ కాంట్రాక్టు చేసుకుంది. అలా ఒక్కొక్కటిగా చెన్నై నగరంలోని అనేక ప్రాంతాల్లో హోటల్ బ్రాంచ్‌లు నెలకొల్పగలిగింది. అయితే అంతా బాగుందనుకున్న సమయంలో ఆమె కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పెట్రిసియా కూతురు సందీఫ-అల్లుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆమె కుంగిపోయింది. అయితే కూతురుకు సరైన సమయంలో అంబులెన్స్ దొరక్కపోవడం వల్లే చనిపోయిందని తెలుసుకుని, ఆమె పేరిట అంబులెన్స్ సర్వీసు ప్రారంభించి ఉచిత సర్వీసు అందిస్తోంది. అంతేకాదు కూతురి పేరిట రెస్టారెంట్స్ కూడా స్థాపించిన పెట్రిసియా.. ప్రస్తుతం Sandeepha Chain Of Restaurants సంస్థకు అధిపతిగా ముందుకు సాగుతోంది.

ఆమె సంపాదన నెలకు రు.50 లక్షలు. 2010లో ఫిక్కీ అత్యుత్తమ వ్యాపారవేత్త పురస్కారం పొందిన తను.. కలల సాకారం కోసం ప్రయత్నించే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిప్రదాత అనడంలో సందేహం లేదు. ‘చాలా మంది నన్ను నీ క్వాలిఫికేషన్ ఏంటి? అని అడుగుతుంటారు. వారికి నేను గర్వంగా చెన్నై మెరీనా బీచ్‌లో ఎంబీఎ చేశానని, వ్యాపార నైపుణ్యాలు అక్కడే నేర్చుకున్నానని చెప్తానని అంటోంది.

Next Story