ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది?.. పార్టీలేమంటున్నాయి?

by  |
ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది?.. పార్టీలేమంటున్నాయి?
X

ఆంధ్రప్రదేశ్‌లో నిన్నచోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు ఆసక్తిరేపుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉండి… రాష్ట్రం మొత్తం ఎన్నికల కోలాహలం నెలకొన్న వేళ చోటుచేసుకున్న అనూహ్య మార్పులు ఏపీలో కలకలం రేపాయి. ఎవరికి వారే యమునాతీరు అన్నట్టు ఈసీదొక దారైతే, ప్రభుత్వానిదొక దారి, ప్రతిపక్షాలదొక దారిలా పరిస్థితి తయారైంది. ఇంతకీ అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఏం జరిగింది? ఎందుకీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? వివరాల్లోకి వెళ్తే…

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ శనివారం రాత్ర తన కార్యాలయంలోనే నిద్రించారు. ఆ రాత్రే ఆదివారం ఉదయం పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదల చెయ్యాలి మీడియా సమావేశం ఏర్పాటుకు వారిని ఆహ్వానించండి అంటూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ మేరకు వారు సందేశమందించారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన కాపీలను 8:30 గంటల సమయంలో జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి ఆయన ఛాంబర్‌కు తీసుకెళ్లారు. తరువాత కలుస్తానంటూ ఆయనను కమిషనర్ నిలువరించారు. అనంతరం గతంలో ఇన్‌ఛార్జీ కమిషనర్‌గా పని చేసిన సత్యరమేష్‌ను పిలిపించుకున్నారు. ఇంతలో మీడియా ప్రతినిధులు అక్కడికి రావడంతో తానే వస్తానని, అంతవరకు వారికి ఎలాంటి సమాచారం అందించవద్దని సూచించారు. అనంతరం ఆయన ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే వివాదాస్పదమైంది.

కరోనా ప్రభావంపై ఎన్నికల కమిషనర్ సీఎస్‌ను కానీ వైద్యఆరోగ్యశాఖ సీఎస్‌ను కానీ విచారించలేదు. అదే సమయంలో శాంతి భద్రతలపై డీజీపీతో చర్చించాల్సి ఉంది. హింసాత్మక సంఘటనలపై ఎన్నికల అధికారులతో ప్రత్యేక నివేదికలు తెప్పించుకోవాలి. ఆ తరువాత ప్రభుత్వం, రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి ఎన్నికలు జరపాలా? వాయిదా వెయ్యాలా? అని నిర్ణయించాలి. ఇవేవీ జరగకుండానే కరోనా నేపథ్యంలో ఈసీ ఏకపక్షంగా విచక్షణాధికారాలు వినియోగిస్తూ ఆరువారాలు వాయిదా వేశారు. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరసిస్తోంది. సామాజిక వర్గ నేపథ్యంతో రమేష్ కుమార్‌ను ఏపీ గత ప్రభుత్వం ఈసీగా నియమించిందని, ఆయన కుమార్తె శరణ్యను ఆర్థికాభివృద్ధి మండలిలో అసోసియేట్ డైరెక్టర్‌గా నియమించి 2 లక్షల రూపాయల వేతనం చెల్లించిందని, ఆమె విదేశీ యానాలు భరించిందని, దానికి కృతజ్ఞతగానే ఆయన స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారంటూ మండిపడుతోంది. ఎన్నికలు వాయిదా వేసేందుకు కరోనా పేరిట రాష్ట్రంలో పానిక్ వాతావరణాన్ని సృష్టించారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆపే కుట్రలో భాగమే స్థానిక ఎన్నికల వాయిదా అని వారు విమర్శిస్తున్నారు.

టీడీపీ నేతలు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అరాచకాలు పెచ్చుమీరాయని, ఆ ఆగడాలు భరించలేకే ఎలక్షన్ కమిషన్ తాజా నిర్ణయం తీసుకుందని ఈసీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఈసీ నిర్ణయం జగన్‌కు చెంపపెట్టు అంటూ తమ మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మరోవైపు ఎన్నికలు వాయిదా వేసేందుకు దారితీసిన పరిస్థితులను ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలపై నేటి సాయంత్రానికి ఈసీ ప్రకటన చేస్తుందని వైఎస్సార్సీపీ భావిస్తుండగా, ఇప్పటికే ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ఈసీ కొత్త ప్రకటన విడుదల చెయ్యదని టీడీపీతో పాటు ఇతర విపక్షాలు ధీమాగా ఉన్నాయి. మరోవైపు ఏపీలో ఎన్నికల కోడ్ మరో ఆరు వారాలు అమలులో ఉండనున్నట్టు తెలుస్తోంది. అంటే ఆరు వారాలపాటు సీఎం జగన్, ఇతర మంత్రులు తీసుకునే నిర్ణయాలకు విలువ ఉండదు. పాలన పడకేసినట్టేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

tags : ysrcp, jagan, ap, ramesh kumar, election commission, polling re notification

Next Story