స్వప్నసుందరిగా ‘ఖుషీ’ ఎంట్రీ ?

by  |
స్వప్నసుందరిగా ‘ఖుషీ’ ఎంట్రీ ?
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శకేంద్రుడి మాయాజాలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రాఘవేంద్రరావు, ఆ తర్వాత భక్తిరస చిత్రాలతోనూ వెండితెరపై తనదైన ముద్ర వేశాడు. చాలా కాలం తర్వాత మళ్లీ ఆయన ఓ కమర్షియల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు. అది కూడా.. రెండు దశాబ్దాల క్రితం విడుదలైన ‘పెళ్లి సందడి’కి సీక్వెల్ కావడం మరో విశేషం. ఈ చిత్రంలో హీరోగా శ్రీకాంత్ కుమారుడు రోషన్ నటిస్తున్నట్లు తెలుస్తుండగా.. హీరోయిన్‌గా అతిలోక సుందరి తనయ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రానికి కీరవాణి స్వరాలు సమకూరుస్తుండగా, శివశక్తి దత్తా, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు.

రాఘవేంద్ర రావు తీసిన సినిమాల్లో.. ‘పెళ్లి సందడి’కి ప్రత్యేక స్థానం ఉంది. మ్యూజికల్‌గానూ సూపర్ హిట్ సాధించిన ఈ చిత్రం.. శ్రీకాంత్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచి, ఆయనకు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. కాగా, హీరో శ్రీకాంత్‌కు ఓ గొప్ప చిత్రాన్ని అందివ్వడంతో పాటు, కెరీర్ బూస్ట్ అందించిన దర్శకేంద్రుడు.. ఈ సారి ఆయన తనయునికి ‘పెళ్లిసందడి’ సీక్వెల్‌తో బ్రేక్ త్రూ అందించాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోగా ఇప్పటికే రోషన్‌ను ఫిక్స్ చేశారని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ సినిమాలో సౌందర్య లహరి ఎవరు? అన్నదే యావత్ తెలుగు అభిమానుల్లో ఉన్న ప్రశ్న. శ్రీదేవిని అతిలోక సుందరిగా చూపించిన దర్శకేంద్రుడు ఈ సారి శ్రీదేవి చిన్న కూతరు ‘ఖుషీ’ని స్వప్నసుందరిగా చూపించబోతున్నాడని సమాచారం. ఈ మేరకు పెళ్లిసందడి చిత్ర యూనిట్ బోనీకపూర్‌తో పాటు ఖుషీని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఖుషీ టాలీవుడ్ ఎంట్రీ నిజమో కాదో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే. ఇదే నిజమైతే జాన్వి కంటే ముందే.. ఖుషీ తెలుగు వారికి పరిచయం అవుతుంది.


Next Story

Most Viewed