అందుకే రిటైర్మెంట్ ఇచ్చా.. కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేసిన యువరాజ్ సింగ్

by Harish |

అందుకే రిటైర్మెంట్ ఇచ్చా.. కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేసిన యువరాజ్ సింగ్
X

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2017‌లో చివరిగా భారత్‌కు ఆడిన అతను రెండేళ్ల తర్వాత వీడ్కోలు పలికాడు. తాజాగా తన రిటైర్మెంట్ వెనుక ఉన్న కారణాన్ని యువీ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ఈ సందర్భంగా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. తన భవితవ్యంపై వీరిద్దరూ క్లారిటీ ఇవ్వకపోవడంతో అయోమయంలో పడిపోయానని చెప్పాడు. భారత క్రికెట్‌కు ఎంతో సేవ చేసి, కెరీర్ చరమాంకంలో ఉన్న వారికి గౌరవం ఇవ్వాలని వాపోయాడు.

‘నాకే కాదు జహీర్ ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్‌లకు కూడా తమ కెరీర్‌పై క్లారిటీ ఇవ్వలేదు. కెప్టెన్, కోచ్, సెలెక్టర్ ఎవరైనా గానీ పరిస్థితిని వివరించాలి. డిస్కషన్ సజావుగా సాగకపోవచ్చు. కానీ, కనీసం ప్రయత్నమైనా జరగాలి కదా. నా విషయానికే వస్తే.. నేషనల్ క్రికెట్ అకాడమీగానీ, కెప్టెన్‌గానీ, కోచ్‌గా నాకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 37 ఏళ్లలో అడుగుపెడుతున్నప్పుడు అయోమయంలో పడిపోయా. క్రికెట్‌కు ఎంతో చేసిన వారికి గౌరవం ఇవ్వాలి.’అని వ్యాఖ్యానించాడు.

ఫిట్‌నెస్ టెస్టు పాసైనప్పటికీ తనను పక్కనపెట్టారని చెప్పాడు. ‘ఫిట్‌నెస్ టెస్టు పాస్ కాకపోతే రిటైర్మెంట్ ఇవ్వాలని నాకు చెప్పారు. నా రిటైర్మెంట్ గురించి నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పా. ఫిట్‌నెస్ టెస్టు ఉత్తీర్ణుడయ్యాను. ఇక ఎంపిక చేయాలా?వద్దా? అన్నది వాళ్ల ఇష్టం. చేసేదేం లేక రిటైర్ అయ్యాను.’అని యువీ తెలిపాడు. ధోనీతో మాట్లాడితే గానీ అసలు విషయం తెలియలేదని, నిజాయితీగా అతను పరిస్థితిని వివరించి సహాయం చేశాడని చెప్పాడు.

Next Story