సెమీస్‌లో ముగిసిన శ్రీకాంత్ పోరాటం

by Dishanational3 |
సెమీస్‌లో ముగిసిన శ్రీకాంత్ పోరాటం
X

దిశ, స్పోర్ట్స్ : స్విట్జర్లాండ్‌తో జరుగుతున్న స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ పోరాటం సెమీస్‌లో ముగిసింది. శనివారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ సెమీస్‌లో శ్రీకాంత్ 21-15, 9-21, 18-21 తేడాతో చైనీస్ తైపీ ఆటగాడు లిన్ చున్ యి చేతిలో పోరాడి ఓడాడు. గంటా 5 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో మొదట శుభారంభం చేసింది శ్రీకాంతే. స్పష్టమైన ఆధిపత్యంతో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.

రెండో గేమ్ ఆరంభంలోనూ అదే జోరు కనబర్చిన అతను 4-1తో ఆధిక్యంలో ఉన్నాడు. ఆ తర్వాత ప్రత్యర్థి పుంజుకోవడంతో తడబడిన శ్రీకాంత్ రెండో గేమ్ కోల్పోయాడు. ఇక, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఇద్దరు పాయింట్ల కోసం పోటీపడటంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. శ్రీకాంత్ తీవ్రంగా పోరాడగా.. ప్రత్యర్థి కూడా ఏమాత్రం తగ్గలేదు. దీంతో 16-16 తర్వాత శ్రీకాంత్ పట్టు కోల్పోయి గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ చైనీస్ తైపీ ఆటగాడికి సమర్పించాడు. శ్రీకాంత్ నిష్ర్కమణతో టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది. ఈ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేసిన శ్రీకాంత్ దాదాపు 16 నెలల తర్వాత ఓ టోర్నీలో తొలిసారిగా సెమీస్‌లో అడుగుపెట్టాడు.


Next Story