సాత్విక్ జోడీ జోరు.. రెండో రౌండ్‌లో శ్రీకాంత్ ఓటమి

by Dishanational3 |
సాత్విక్ జోడీ జోరు.. రెండో రౌండ్‌లో శ్రీకాంత్ ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాదిని విజయం మొదలుపెట్టిన భారత పురుషుల డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోరు కొనసాగుతోంది. కౌలాలంపూర్‌లో జరుగుతున్న మలేషియా ఓపెన్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో సాత్విక్ జోడీ 21-11, 21-18 తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన లుకాస్ కార్వీ-రోనన్ లాబర్‌ జోడీపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత జట్టు కేవలం 39 నిమిషాల్లోనే ప్రత్యర్థి జోడీ ద్వయం ఆట ముగించింది. తొలి గేమ్‌ను ఏకపక్షంగా గెలుచుకున్న సాత్విక్, చిరాగ్‌లకు రెండో గేమ్‌లో ఫ్రాన్స్ షట్లర్ల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఒక దశలో 13-6తో భారత ద్వయం వెనుకబడింది. ఆ తర్వాత బలంగా పుంజుకుని వరుసగా పాయింట్లు నెగ్గి 16-16తో స్కోరును సమం చేసింది. అనంతరం ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ దక్కించుకుంది. నేడు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చైనాకు చెందిన హీ జీ టింగ్-రెన్ జియాంగ్ యుతో సాత్విక్ జంట పోటీపడనుంది. ఉమెన్స్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో-అశ్విని పొన్నప్ప జోడీ కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. రెండో రౌండ్‌లో అశ్విని జోడీ 21-19, 13-21, 21-15 తేడాతో 7వ సీడ్, జపాన్ జోడీ వకానా నగహర-మయు మత్సుమోటోపై పోరాడి గెలిచింది. మరోవైపు, భారత సింగిల్స్ స్టార్ ప్లేయర్, తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ రెండో రౌండ్‌లో నిరాశపరిచాడు. తొలి రౌండ్‌లో అద్భుత విజయం సాధించిను అతను రెండో రౌండ్‌లో అంచనాలను అందుకోలేకపోయాడు. హాంకాంగ్‌కు చెందిన అంగస్ లాంగ్ చేతిలో 21-13, 21-17 తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్ర్కమించాడు.


Next Story

Most Viewed