ముంబైకి బ్యాడ్ న్యూస్.. స్టార్ పేసర్‌కు గాయం

by Dishanational3 |
ముంబైకి బ్యాడ్ న్యూస్.. స్టార్ పేసర్‌కు గాయం
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్, శ్రీలంకకు చెందిన దిల్షాన్ మధుశంక గాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో మధుశంకకు గాయమైంది. తొడకండరాల సమస్యతో మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. స్కానింగ్‌లో గాయం తీవ్రత ఎక్కుగా ఉన్నట్టు తేలింది. దీంతో బంగ్లాతో మూడో వన్డేకు అతను దూరమైనట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు ఆదివారం వెల్లడించింది. అలాగే, మిగతా పర్యటన నుంచి అతను వైదొలిగినట్టు తెలిపింది.

మధుశంక గాయపడటం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు కూడా భారీ దెబ్బే. వేలంలో అతన్ని ముంబై ఫ్రాంచైజీ రూ.4.60 కోట్లకు సొంతం చేసుకుంది. గాయం తీవ్రత కారణంగా అతను ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్టు తెలుస్తోంది. 2022లో టీ20ల్లోకి అరంగేట్రం చేసిన మధుశంక శ్రీలంక తరపున 14 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్‌లో 9 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. దీంతోనే వేలంలో అతన్ని ముంబై భారీ ధరకు కొనుగోలు చేసింది. మరోవైపు, సౌతాఫ్రికా యువ పేసర్ గెరాల్డ్ కోయెట్జీ కూడా గాయం కారణంగా ఐపీఎల్‌లో పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో ఇద్దరు పేసర్లు లీగ్‌కు దూరమమైతే ముంబై బౌలింగ్ దళాన్ని కోలుకోని దెబ్బ తీస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, ఈ నెల 24న గుజరాత్ టైటాన్స్‌తో ముంబై తొలి మ్యాచ్ ఆడనుంది.


Next Story

Most Viewed