ఇంగ్లాండ్ గడ్డపై చెలరేగిన రాహుల్

by Harish |   (  Updated:2025-06-07 01:44:17  IST  )

ఇంగ్లాండ్ గడ్డపై భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీతో కదం తొక్కాడు.

ఇంగ్లాండ్ గడ్డపై చెలరేగిన రాహుల్
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ గడ్డపై అదరగొట్టాడు. ఇంగ్లాండ్‌ లయన్స్‌తో రెండో అనధికార టెస్టుకు అందుబాటులోకి వచ్చిన అతను సెంచరీతో కదం తొక్కాడు. భారత్ ఏ, ఇంగ్లాండ్ లయన్స్ జట్ల తొలి అనధికార టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. రెండో అనధికార టెస్టు శుక్రవారం ప్రారంభమైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఏ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 319 రన్స్ చేసింది. ఓపెనర్‌గా వచ్చిన రాహుల్ సత్తాచాటాడు.

మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా క్రీజులో పాతుకపోయి జట్టుకు అండగా నిలిచాడు. ప్రత్యర్థి బౌలర్లను మూడుచెరువుల నీళ్లు తాగించాడు. 168 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 116 పరుగులు చేసి అవుటయ్యారు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు ఉన్నాయి. రాహుల్ తర్వాత ధ్రువ్ జురెల్(52) హాఫ్ సెంచరీతో రాణించాడు. కరుణ్ నాయర్(40) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరితో కలిసి రాహుల్ జట్టును నడిపించాడు. కరుణ్‌తో కలిసి 86 రన్స్ జత చేయగా.. జురెల్‌తో కలిసి 121 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించాడు. దీంతో భారత్ 247/4తో మెరుగైన స్థితిలో నిలిచింది. ఇక, తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి(34) పర్వాలేదనిపించగా.. యశస్వి జైశ్వాల్(17), కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్(11), శార్దూల్ ఠాకూర్(19) నిరాశపరిచారు. ఇంగ్లాండ్ లయన్స్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3 వికెట్లతో సత్తాచాటాడు.

Next Story