రెజ్లింగ్ సంక్షోభంలో కీలక పరిణామం: జంతర్ మంతర్ వద్ద జూనియర్ రెజ్లర్ల నిరసన

by samatah |
రెజ్లింగ్ సంక్షోభంలో కీలక పరిణామం: జంతర్ మంతర్ వద్ద జూనియర్ రెజ్లర్ల నిరసన
X

దిశ, స్పోర్ట్స్: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్లూఎఫ్ఐ) వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని సుమారు ఏడాది పాటు నిరసన తెలిపారు. దీంతో డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్‌ను కేంద్రం రద్దు చేసింది. అయితే తాజాగా బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో పలువురు రెజ్లర్లు తమ పతకాలను వెనక్కి ఇచ్చేశారు. ప్రముఖ రెజ్లర్ సాక్షి మాలిక్ ఏకంగా తన కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో మరోసారి ప్రభుత్వం డబ్లూఎఫ్ఐని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా బుధవారం జూనియర్ రెజర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపారు. యూపీ, హర్యానా, ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి వందల మంది రెజర్లు ధర్నాకు తరలివచ్చారు. తమ కెరీర్‌లో ఓ కీలకమైన ఏడాదిని కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి కారణం సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ పోగట్ లేనని ఆరోపించారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, బ్యానర్లు ప్రదర్శించారు. భద్రతా సిబ్బంది రెజ్లర్లను అడ్డుకునే ప్రయత్నం చేయగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ భవిష్యత్ నాశనమయ్యే పరిస్థితి నెలకొందని ప్రభుత్వం ఇప్పటి కైనా స్పందించి డబ్లూఎఫ్ఐని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed