రంజీ ట్రోఫీ సెమీస్‌లో అద్భుతం చేసిన కేరళ.. గుజరాత్‌‌కు ఊహించని షాక్

by Harish |

రంజీ ట్రోఫీ‌లో భాగంగా గుజరాత్‌తో జరిగిన సెమీస్‌లో కేరళ జట్టు అద్భుతం చేసింది.

రంజీ ట్రోఫీ సెమీస్‌లో అద్భుతం చేసిన కేరళ.. గుజరాత్‌‌కు ఊహించని షాక్
X

దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీ 2024-25 తుది దశకు చేరుకుంది. కేరళ, విదర్భ జట్లు శుక్రవారం ఫైనల్‌కు దూసుకెళ్లాయి. గుజరాత్‌తో జరిగిన సెమీస్‌లో కేరళ జట్టు అద్భుతం చేసింది. ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌ డ్రాగా ముగియగా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా కేరళ ఫైనల్‌కు అర్హత సాధించింది. రంజీ ట్రోఫీ చరిత్రలో టైటిల్ పోరుకు చేరుకోవడం కేరళకు ఇదే తొలిసారి. తొలి ఇన్నింగ్స్‌లో కేరళ 457 రన్స్ చేసింది. అయితే, గుజరాత్ కూడా దీటుగా బదులివ్వడంతో మ్యాచ్ డ్రా దిశగా సాగింది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి 429/7తో నిలిచిన ఆ జట్టుకు ఫైనల్‌కు చేరుకోవడానికి మరో 29 రన్స్ మాత్రమే కావాలి. జయ్‌మీట్ పటేల్, సిద్ధార్థ్ దేశాయ్ క్రీజులో పాతుకపోవడంతో గుజరాతే ఫైనల్‌కు చేరుకుంటుందని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ, శుక్రవారం కేరళ స్పిన్నర్ ఆదిత్య సర్వతే గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లాడు. జయ్‌మీట్ పటేల్(79), సిద్ధార్థ్ దేశాయ్(30)లతోపాటు నాగ్వాసాల్లా(10)లను అవుట్ చేయడంతో గుజరాత్ 455 స్కోరుకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 2 పరుగుల ఆధిక్యం దక్కడంతో కేరళ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌కు దిగిన కేరళ ఆట ముగిసే సమయానికి 114/4 స్కోరు చేసింది. మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన కారణంగా కేరళ ఫైనల్‌‌కు చేరుకుంది.

ముంబైకి షాకిచ్చిన విదర్భ

మరో సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబైకి విదర్భ షాక్ ఇచ్చింది. మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన ఆ జట్టు 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా వరుసగా రెండోసారి, మొత్తంగా నాలుగోసారి ఫైనల్‌లో అడుగుపెట్టింది. 405 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై 325 స్కోరుకే పరిమితమైంది. ఓవర్‌నైట్ స్కోరు 83/3తో శుక్రవారం ఆట కొనసాగించిన ముంబై పోరాడినా.. సూర్యకుమార్(23), దూబె(12) నిరాశపర్చడం జట్టును నష్టపరిచింది.శార్దూల్ ఠాకూర్(66) హాఫ్ సెంచరీతో మెరవగా.. షామ్స్ ములానీ(46), మోహిత్(34)విలువైన రన్స్ జోడించినప్పటికీ ఫలితం దక్కలేదు. విదర్భ బౌలర్ హర్ష్ దూబె ఐదు వికెట్లతో ముంబై నిలువరించాడు.


Next Story