మూడో టెస్టుకు బుమ్రా దూరం?.. కారణం ఏంటంటే?

by Dishanational3 |
మూడో టెస్టుకు బుమ్రా దూరం?.. కారణం ఏంటంటే?
X

దిశ, స్పోర్ట్స్ : రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై టీమ్ ఇండియా భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. రాజ్‌కోట్ వేదికగా ఈ నెల 15 నుంచి 19 వరకు మూడో టెస్టు జరగనుంది. ఈ టెస్టుకు ఇంకా సెలెక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించలేదు. మూడో టెస్టుతోపాటు మిగతా సిరీస్‌కు మంగళవారం జట్టును వెల్లడించే అవకాశం ఉంది. ఈ క్రమంలో మూడో టెస్టుకు ఓ స్టార్ ఆటగాడు దూరమవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. అతను మరెవరో కాదు.. స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా. రెండో టెస్టులో 9 వికెట్లతో ఇంగ్లాండ్‌ను బెంబేలెత్తించిన అతను టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

అయితే, మూడో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. రెండో టెస్టు అనంతరం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో చాలా సేపు చర్చించాడు. ప్రధానంగా మిగతా సిరీస్‌కు జట్టు ఎంపికపైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అందులో బుమ్రా గురించి కూడా చర్చించినట్టు సమాచారం. టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్ నేపథ్యంలో అతనిపై పనిభారం తగ్గించాలని సెలెక్టర్లు భావిస్తున్నారని, అందుకే, రాజ్‌కోట్ వేదికగా జరిగే మూడో టెస్టుకు అతనికి విశ్రాంతినివ్వాలని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై జట్టు ప్రకటన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

టెస్టు సిరీస్‌లో 15 వికెట్లతో బుమ్రా టాప్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. తొలి రెండు టెస్టుల్లోనూ అతను బంతితో అద్భుత ప్రదర్శన చేశాడు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై కూడా తన పేస్‌తో ఇంగ్లాండ్‌ను బెంబేలెత్తించాడు. మరోవైపు, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంగ్లాండ్ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టడంలో వాళ్లు విఫలమయ్యారు. మరోవైపు, షమీ, జడేజా కూడా మిగతా సిరీస్‌కు దూరం కానున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుమ్రాకు విశ్రాంతినిస్తే మూడో టెస్టులో భారత్‌కు పెద్ద లోటే. ఒకవేళ బుమ్రా దూరంగా ఉంటే రెండో టెస్టుకు దూరమైన సిరాజ్ జట్టులోకి రావడం ఖాయమే. సిరాజ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్ త్రయం ఏ మేరకు రాణిస్తుందో చెప్పలేం.

Next Story

Most Viewed