చెత్త పిచ్ తయారు చేసిన లక్నో క్యూరేటర్‌పై వేటు..

by Disha Web Desk 13 |
చెత్త పిచ్ తయారు చేసిన లక్నో క్యూరేటర్‌పై వేటు..
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరిగిన రెండో టీ20కి తయారు చేసిన పిచ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ పిచ్‌పై బ్యాటర్లు 100 పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఒక్క సిక్స్ కూడా నమోదు కాలేదంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ధనాధన్ బ్యాటింగ్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన టీ20ల్లో ఏ మాత్రం ఊహించని స్పిన్ వికెట్‌ను చూసిన ఇరు జట్ల ఆటగాళ్లు, అభిమానులు, ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం ఇదో చెత్త పిచ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

టీ20 ఫార్మాట్‌కు ఏమాత్రం సరిపోయేది కాదని, క్యూరెటర్లు మంచి పిచ్‌లు తయారు చేయడంపై దృష్టి సారించాలని కోరాడు. బీసీసీఐ సైతం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌ను వివరణ కూడా కోరినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ విమర్శలను అవమానంగా భావించిన ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్.. లక్నో పిచ్ క్యూరేటర్ సురేందర్‌పై వేటు వేస్తూ.. చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో గ్వాలియర్‌కు చెందిన సంజీవ్ అగర్వాల్‌ను నియమించారు.


Next Story

Most Viewed