బెంగళూరు తొక్కిసలాట.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ

by Harish |

బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే.

బెంగళూరు తొక్కిసలాట.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ
X

దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాలు జరుగుతున్న వేళ బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆర్సీబీ ఫ్రాంచైజీపై కేసు నమోదవ్వగా.. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్‌తోపాటు నలుగురు అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ యాజమాన్య సంస్థ రాయల్ చాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఆర్‌సీఎస్‌ఎల్) కర్ణాటక హైకోర్టు‌ను ఆశ్రయించింది. తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరింది. ఈవెంట్‌కు పరిమిత సంఖ్యలోనే పాస్‌లు అందుబాటులో ఉన్నాయని సోషల్ మీడియాలో పోస్టు చేశామని, ఈ కేసులో తమను తప్పుగా ఇరికిస్తున్నారని ఆర్‌సీఎస్‌ఎల్ తమ పిటిషన్‌లో పేర్కొంది.

కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌తో విస్తృత చర్చలు జరిపిన తర్వాత ఈవెంట్ నిర్వాహకులు డీఎన్‌ఏ నెట్‌వర్క్, పోలీసులకు, ఆర్‌సీఎస్‌ఎల్‌కు మౌఖిక ధ్రువీకరణ వచ్చిన తర్వాతే ఆర్సీబీ విక్టరీ పరేడ్‌ ప్రకటన చేసిందని తెలిపింది. సన్మాన కార్యక్రమానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్యనే ప్రజలను ఆహ్వానించారని పిటిషన్‌లో పేర్కొంది. అందుకు సీఎం ట్వీటే ఆధారమని చెప్పింది. స్టేడియంలో ఈవెంట్ జరుగుతున్నప్పుడే తమకు స్టేడియం వెలుపల మరణాల గురించి తెలిసిందని, ఆ వెంటనే త్వరగానే ఈవెంట్‌ను ముగించామని తెలిపింది. ఈవెంట్ నిర్వాహకులు డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ పోలీసుల వైఫల్యం కారణంగానే తొక్కిసలాట చోటుచేసుకుందని తమ పిటిషన్‌లో పేర్కొంది. స్టేడియం వద్ద తగినంత పోలీసులను మోహరించలేదని తెలిపింది.


Next Story