సంచలనం.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌‌లో మరో మలుపు

by  |
సంచలనం.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌‌లో మరో మలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో : వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యాచారం, హత్యతో సంబంధం ఉందన్న ఆరోపణలపై పోలీసుల అదుపులో ఉన్న నలుగురు యువకుల ఎన్‌కౌంటర్‌పై ప్రత్యేక ఎంక్వయిరీ కమిషన్ శనివారం విచారణ జరిపింది. ఎన్‌కౌంటర్‌కు దారితీసిన కారణాల మొదలు పోలీసుల దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు, కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లోని అంశాల వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన హోంశాఖ కార్యదర్శి రవిగుప్త వివరణ ఇచ్చారు. ఎన్‌కౌంటర్‌పై ఉన్న సందేహాలను ప్రశ్నల రూపంలో న్యాయవాదులు ఆయనపై వర్షం కురిపించారు. రవిగుప్త ఇచ్చిన వివరణను రికార్డు చేసిన కమిషన్ ఈ నెల 26వ తేదీ నుంచి మూడు రోజుల పాటు 18 మంది సాక్షుల నుంచి వివరాలను సేకరించనున్నది.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఎంక్వయిరీ కమిషన్ హైకోర్టు భవనంలోని సి-బ్లాక్‌లో శనివారం ఉదయం 11.30 గంటల నుంచి విచారణ నిర్వహించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ వీఎస్ సిర్పూర్‌కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం జరిపిన విచారణకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా రవిగుప్త హాజరయ్యారు. అనేక ప్రజా సంఘాలు, పౌరహక్కుల సంఘాలు నలుగురు యువకుల ఎన్‌కౌంటర్‌పై సందేహాలను వ్యక్తం చేయడంతో ఈ ముగ్గురితో ఎంక్వయిరీ కమిషన్ ఏర్పాటైంది. విచారణకు హాజరుకావాల్సిందిగా నాలుగు రోజుల క్రితమే ప్రభుత్వానికి కమిషన్ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగా అనేక సందేహాలకు రవిగుప్త సమాధానం ఇచ్చారు.

ఎన్‌కౌంటర్‌కు దారితీసిన కారణాలు, పోలీసుల అదుపులో ఉండగా వారికి ఎదురుకాల్పులు జరిపే పరిస్థితి ఎలా తలెత్తింది, వారికి తగిన భద్రత కల్పించి పారిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో చోటుచేసుకున్న నిర్లక్ష్యం తదితర పలు అంశాలపై న్యాయవాదులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్‌కౌంటర్ సంఘటన చోటుచేసుకోవడానికి దారితీసిన పరిస్థితులను ధృవీకరించే సాక్ష్యాధారాల మొదలు అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాల వరకు రవిగుప్త నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా న్యాయవాదులు వివరాలను సేకరించారు.

ఎన్‌కౌంటర్‌కు గురైన నలుగురు యువకుల కుటుంబ సభ్యులు, వారు చదువుకున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రత్యక్ష సాక్షులు తదితర మొత్తం 18 మంది నుంచి ఈ నెల 26, 27, 28 తేదీల్లో హైకోర్టులో విచారణ జరగనున్నది. ఇప్పటికే వారికి ఆరు నోటీసులను కమిషన్ కార్యదర్శి జారీ చేశారు. విచారణకు హాజరై ఎన్‌కౌంటర్‌పై ఉన్న సందేహాలను నిర్భయంగా చెప్పాల్సిందిగా ఇప్పటికే న్యాయవాది వారికి అర్థం చేయించారు. కోర్టుల్లో వేసిన కేసులను ఉపసంహరించుకోవాల్సిందిగా వారిపై వత్తిడి పెరుగుతున్నదని, భారీ స్థాయిలో డబ్బులు ముట్టచెప్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని న్యాయవాదులు ఆరోపిస్తున్న సమయంలో కమిషన్ వారి నుంచి వివరాలను రాబట్టాలనుకోవడం విశేషం.

Next Story