ఇండియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం

by  |
ఇండియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం
X

దిశ, స్పోర్ట్స్ : కరోనా కారణంగా పలు సిరీస్‌లు వాయిదా పడి క్రికెట్‌కు దూరమైన టీమ్ ఇండియా మహిళా క్రికెట్ జట్టు ఏడాది తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్నది. భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా మహిళా జట్టు తొలి మ్యాచ్‌లో అదరగొట్టింది. 8 వికెట్ల తేడాతో మిథాలీ సేనను ఓడించి బోణీ కొట్టింది.

ఈరోజు లక్నో వేదికగా ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జరిగింది. టాస్ గెలిచిన దక్షిణాప్రికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 177 పరుగులు మాత్రమే చేసింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమయైన సమయంలో కెప్టెన్ మిథాలీ రాజ్ (50), వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (40) జట్టును ఆదుకున్నారు. దీప్తి శర్మ (27) కూడా పరుగులు రాబట్టడంతో భారత జట్టు కాస్త ఈ పరుగులైనా సాధించగలిగింది.

178 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాప్రికా జట్టు ఓపెనర్లు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. లిజిల్లే లీ (83 నాటౌట్), లారా వోల్వర్ట్ (80) కలసి 169 పరుగులు జోడించారు. భారత మహిళలు ఏ సమయంలోనూ దక్షిణాప్రికా బ్యాటర్లపై ఒత్తిడి తేలేకపోయారు. చివరిలో జులన్ గోస్వామి రెండు వికెట్లు తీసినా అప్పటికే విజయానికి చేరువైన దక్షిణాఫ్రికాను అడ్డుకోలేకపోయింది. లారా, సునే లాస్(1) చివర్లో అవుటయ్యారు. 40.1 ఓవర్లలో దక్షిణాఫ్రికా జట్టు 2 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. కీలక వికెట్లు తీసి టీమ్ ఇండియాను పడగొట్టిన షబ్నిమ్ ఇస్మాయేల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


Next Story

Most Viewed