అర్హులైన అందరికీ త్వరలోనే పెన్షన్లు : ఎర్రబెల్లి

by  |
Errabelli
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆసరా పింఛన్లకు కనీస వయస్సు 65 ఏళ్లు నుంచి 57 ఏళ్లకు తగ్గించినందున అర్హత ఉన్న లబ్ధిదారుల జాబితాను వెంటనే రూపొందించి, పెన్షన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆసరా పెన్షన్లు, వయో పరిమితి తగ్గింపు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి మూడ్రోజుల్లోగా పెన్షన్లు మంజూరు చేయాలని అధికారులను అదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని ఉద్యోగులు, అధికారులకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న అధికారులు ఉద్యోగుల ఖాళీల భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులతో పల్లె ప్రగతిలో భాగంగా హరితహారం పథకం కింద నాటిన మొక్కలను నూరుశాతం బతికే విధంగా ప్రత్యేక చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను ఎప్పటికప్పుడు సోషల్ ఆడిటింగ్ చేసి నిధులు సద్వినియోగం అయ్యేలా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు పనుల సోషల్ ఆడిట్ మానిటరింగ్ కోసం మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు, డీఆర్డీఓ ప్రాజెక్ట్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. సోషల్ ఆడిట్ పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని, అంతేకాకుండా విలేజ్ రిసోర్స్ పర్సన్స్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆయన ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఇంజనీరింగ్ అధికారుల సీనియారిటీ, ఇతర సమస్యలను పరిష్కరించి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి శాశ్వత పరిష్కారం కొరకు నివేదిక అందజేయాలని కోరారు. సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సోషల్ ఆడిట్ డైరెక్టర్ సౌమ్య, శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed