సంచలనం రేపుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మర్డర్.. అసలేం జరిగింది.?

by  |
Murder
X

దిశ, కామారెడ్డి : శుక్రవారం మధ్యాహ్నం అన్నయ్య ఇంటికి వెళ్ళొస్తానని తండ్రికి చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తిరిగి ఇంటికి రాలేదు. దాంతో శనివారం తండ్రి పోలీస్ స్టేషన్‌లో తన కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఆదివారం మధ్యాహ్నం ఆ వ్యక్తి మృతి చెందాడని సమాచారం అందింది.

వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి పట్టణంలోని స్నేహపూరి కాలనీలో నివాసం ఉంటున్న బొల్లపల్లి రాకేష్ కుమార్(30) ఏడాది కాలంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, రెండు రోజుల క్రితం తన తండ్రి విఠల్ రెడ్డికి తాను దేవీవిహార్‌లో ఉంటున్న తన అన్నయ్య వద్దకు వెళ్లి వస్తానని చెప్పిన రాకేష్ ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే, శనివారం మధ్యాహ్నం అయినా రాకేష్ ఇంటికి రాకపోవడంతో తండ్రి విఠల్ రెడ్డి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

రాకేష్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని, ఫోన్ నంబర్ ద్వారా ఆచూకీ కనుక్కుంటామని పట్టణ సీఐ మధుసూదన్ తెలిపారు. అయితే, ఇంటి నుంచి కనిపించకుండా పోయిన రాకేష్ కుమార్ మాచారెడ్డి మండలం ఇసాయిపేట గ్రామ శివారులో విగతజీవిగా కనిపించాడు. రాకేష్ మృతదేహం వద్ద ఓ పురుగుల మందు డబ్బా, సిరంజీ పడి ఉన్నాయి. పార్కింగ్ చేసి ఉన్న స్కూటీపై ఓ బ్యాగ్ ఉంది. రాకేష్ మృతదేహం బోర్లా పడి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

రాకేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడా.? లేదా ఎవరైనా హత్యచేసి ఉంటారా.? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పురుగుల మందు డబ్బా మృతదేహం వద్ద ఉండటం, పక్కన సిరంజీ ఉండటంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. మిస్టరీగా మారిన ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

kamareddy


Next Story

Most Viewed