ఏటీఎంలలో క్యాష్ నింపేది వారే.. దొంగిలించేది కూడా వారే !

by  |
ఏటీఎంలలో క్యాష్ నింపేది వారే.. దొంగిలించేది కూడా వారే !
X

దిశ,మహబూబాబాద్ టౌన్ : ఏటీఎంలలో డబ్బు నింపి, ఆ డబ్బును వారే దొంగిలించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లాలో వివిధ ఏటీఎంలలో నగదు రూ.52,59,500/-లు దుర్వినియోగం చేసి, యాక్సిస్ బ్యాంకు ఏటీయం తగలబెట్టిన కేసులో ఐదుగురి నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ.6,70,000/-ల నగదు, 23,00,000/-ల విలువ చేసే రెండు ప్లాట్‌ల కాగితాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మహబూబాబాద్ పట్టణం, కేసముద్రంలలోని యాక్సిస్,హెచ్ డీ ఎఫ్ సీ, ఐసీఐసీఐ, ఇండిక్యాష్, ఇండియా1 ఏటీఎంలలో ఫిల్ చేయవలసిన డబ్బులను కొన్ని రోజుల నుండి దుర్వినియోగం చేస్తూ అట్టి నేరంను కప్పి పుచ్చుకోవడానికి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంను కాలబెట్టిన కేసులో నిందితున్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. విచారణలో తన పేరు జడల నాగరాజు, తండ్రి వెంకటేశం, మిలటరీ కాలనీ, మహబూబాబాద్ వ్యక్తి అని తెలిపారు. అంతే కాకుండా తన తోటి ఉద్యోగి రాజేందర్, ధరావత్ మహేష్ లతో కలిసి వివిధ ఏటీఎంలలో ఫిల్ చేయవలసిన డబ్బుల్లో నుండి కొంత డబ్బులను తీసి బ్యాంక్ ఆడిట్లలో బయట పడతదేమోనని, సాక్ష్యాలు తారుమారు చేయడానికి యాక్సిస్ బ్యాంకు ఏటీఎం ను కాలబెట్టిమన్నారు. దీనికోసం దాసరి కృష్ణ ప్రసాద్, బోయిన సాయికుమార్, ఎడ్ల రాంచరణ్, గంగరబోయిన యశ్వంత్, ప్రసాద్ లతో రూ.లు 2,00,000/-లకు సుఫారి మాట్లాడుకొని తేది. 13.10.2021 రోజున మహబూబాబాద్, మార్వాడి బజార్ లోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎంను తగులబెట్టించడం జరిగిందన్నారు.

నిందితుల విచారణలో జడల నాగరాజు,రాజేందర్, ధరావత్ మహేష్ లు ఏటీఎం ఆపరేటర్ లుగా పని చేసేవారు. వీరు మహబూబాబాద్ కేసముద్రం‌లలో ఉండే ఏటీఎంలలో క్యాష్ నింపుతుంటారు. జడల నాగరాజు, రాజేందర్ నాలుగు సంవత్సరాల నుండి మహేష్ ఒక సంవత్సరం నుండి ఈ కంపెనీలో పని చేస్తున్నారు. అయితే వీరి చేతుల్లోకి అధిక మొత్తంలో డబ్బులు రావడంతో అత్యాశలో పడి ఈ ఏటీఎంలలో ఫిల్ చేయవలసిన డబ్బులను బ్యాంకుల నుండి తీసుకొని ఆయా బ్యాంకుల ఏటీఎంలలో ఫిల్ చేయకుండా వారి సొంతానికి వాడుకున్నారు. ఈ ముగ్గురు వాడుకున్న డబ్బుల మొత్తం రూ. 52,59,500. ఇట్టి మొత్తంలో ఎక్కువ భాగం జడల నాగరాజు రూ.42,00,000 వరకు, రాజేందర్ అనే వ్యక్తి రూ. 9,00,000వరకు, ధరావత్ మహేష్ రూ. 1,59,500 వరకు, వారి సొంతానికి తీసుకున్నారు. జడల నాగరాజు నుండి రూ. 23,00,000ల విలువ చేసే రెండు ప్లాట్ ల కాగితాలు, రూ.5,90,000లు, గంగరబోయిన యశ్వంత్ నుండి రూ. 30,000/-లు, కృష్ణ ప్రకాష్ నుండి రూ.20,000లు, లోకల్ బోయిన సాయికుమార్ నుండి రూ. 15,000 లు, ఎడ్ల రాంచరణ్ నుండి రూ.15, 000లు సీజ్ చేయడం జరిగిందన్నారు.

అయితే ఇట్టి కంపెనీ తమ ఆధ్వర్యంలో ఉన్న ఏటీఎంలలో మూడు నెలలకోసారి ఆడిట్ చేస్తుంది. ఆడిట్లో వీరి నేరం బయటపడకుండా ఒక ఏటీఎంను చెక్ చేసేటప్పుడు దాంట్లో ఉండవలసిన డబ్బులు మొత్తం పెట్టి తరువాత ఏటీఎంను చెక్ చేయడానికి పోతే, చెక్ చేసిన ఏటీఎంలో నుండి డబ్బులు తీసి చెక్ చేయవలసిన ఏటీఎం లలో పెట్టుకుంటూ పోతూ ఆడిట్ కరెక్ట్‌గా వచ్చేవిధంగా చూసుకునేవారని, ఈ మధ్య కాలంలో ఆర్బీఐ కూడా బ్యాంకులకు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందని, అందులో ఏటీఎంలలో నో క్యాష్ అనే బోర్డు పెట్టినప్పటి నుండి పది గంటల లోపు క్యాష్ పెట్టకపోతే ఆ ఏటీఎంకు సంబంధించిన బ్యాంకులకు ఫైన్ వేస్తామని తెలుపగా, అందువల్ల బ్యాంకు అధికారులు వారు ఇచ్చిన అమౌంట్ ఏటీఎంలలో ఉన్నవా లేవా అని ఆడిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో నేరస్తులు తమ నేరం గురించి ఎప్పటికైనా బయట పడుతుందని డబ్బులు కట్టవలసి వస్తుందని పథకం ప్రకారంగా ఏటీఎంను తగలబెట్టించినారు. ఆ ఏటీఎం‌ను తగలబెట్టే రోజు జడల నాగరాజు ఏటీఎంలో పెట్రోల్ నింపిన కవర్స్‌ను పెట్టడం జరిగింది. అదే రోజు రాత్రి దాసరి కృష్ణ ప్రసాద్, బోయిన సాయికుమార్, ఎడ్ల రాంచరణ్, యశ్వంత్, ప్రసాద్‌లు ఏటీఎంను తగులబెట్టారు.

మీ బ్యాంకు, కంపెనీలలో పని చేసే వ్యక్తులపై తగు పోలీస్ విచారణ చేయించి వారిని ఉద్యోగంలో పెట్టుకోవాలి, వారిపై నిరంతరం నిఘా ఉంచి ప్రజలకు మీ బ్యాంకుల నుంచి ఏటీఎంల నుండి నిరంతరంగా అంతరాయం లేకుండా సేవలు అందే విధంగా చూడాలన్నారు. ఈ కేసులో విశ్వసనీయ సమాచారం సేకరించి నేరస్తులను పట్టుకున్న మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ జె. వెంకట రత్నం, సీసీఎస్ సీ ఐ ఏ. వెంకటేశ్వర రావు, టౌన్ ఎస్ఐలు, వారి సిబ్బందిని, వీరందరినీ గైడ్ చేసిన మహబూబాబాద్ డీఎస్పీ సదయ్యలను ఎస్పీ రివార్డ్స్ తో అభినందించారు.


Next Story

Most Viewed