మందుబాబులకు ఊహించని షాక్.. 75 శాతం పెరిగిన ధరలు

by  |
మందుబాబులకు ఊహించని షాక్.. 75 శాతం పెరిగిన ధరలు
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు ఊహించని షాకిచ్చింది. నిన్న ఉదయం 11 గంటలకు మద్యం దుకాణాలు ఓపెన్ చేయొచ్చని ప్రకటించిన ప్రభుత్వం మద్యం ధరలను 25 శాతం పెంచింది. అయినప్పటికీ మందుబాబులు వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వం ధరలు పెంచినా వెనకంజ వేయకుండా భారీ ఎత్తున కొనుగోళ్లు చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఆలోచనలో పడింది.

దీంతో మరోసారి సమీక్ష నిర్వహించింది. ఈ క్రమంలో అధికారులు పలు రాష్ట్రాల్లో పెంచిన ధరలు, కోనుగోళ్ల తీరుపై ప్రభుత్వానికి వివరించారు. విపక్షాలన్నీ ఆదాయం కోసమే మద్యం అమ్మకాలు ప్రారంభం అంటున్న నేపథ్యంలో నియంత్రణ కోసమే ధరలు పెంచామని ప్రభుత్వం చెబుతోంది. దీనిని మరింత బలపరిచేలా ఇతర రాష్ట్రాలకు దీటుగా ఒక్కసారిగా మరో 50 శాతం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆఘమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీలో మద్యంపై టాక్స్ 75 శాతం పెరిగింది.

ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ ధరలను కూడా ప్రభుత్వం పెంచింది. పెరిగిన ధరలను సంబంధించి ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. కొత్త ధరల ప్రకారం క్వార్టర్ రూ. 120 వరకు ఉన్న మద్యం ధర మరో రూ. 40 పెరిగింది. క్వార్టర్ రూ. 120 నుంచి రూ. 150 వరకు ఉన్న మద్యం ధర రూ. 80 పరిగింది. రూ. 150 కంటే ఎక్కువ ఉన్న ధర మరో రూ. 120 పెరిగింది. చిన్న బీరు ధర రూ. 40, పెద్ద బీరు ధర రూ. 60 పెంచారు.

ఈ సమీక్ష నేపథ్యంలో మద్యం దుకాణాలను గంట ఆలస్యంగా తెరిచారు. పెంచిందన్న మాట. నిన్నటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది. ఈ పెంచిన ధరలు ఇవాళ్టి నుంచే అమలు కానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి షాపులు తెరుచుకోనున్నాయి. కాగా ఈ నెలాఖరులోగా 15శాతం మద్యం దుకాణాలను మూసేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న షాపుల సంఖ్య 3,468. మద్యం వ్యసనాన్ని తగ్గించేందుకే ఇలా ధరల పెంచుతున్నట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్షాలు మాత్రం జే ట్యాక్స్ అంటూ దుమ్మెత్తిపోస్తున్నాయి.

ఏపీలో అధికారికంగా మొత్తం 3,468 మద్యం దుకాణాలు ఉన్నాయి. కంటైన్‌మెంట్ జోన్ల ఆంక్షల నేపథ్యంలో ఇప్పటి వరకు 2,345 మద్యం దుకాణాలను మాత్రమే తెరిచారు. ప్రకాశం జిల్లా మొత్తం మద్యం దుకాణాలు తెరిచేందుకు కలెక్టర్ ఆదేశాలివ్వలేదు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు 1125 దుకాణాలు తెరవలేదు. 25 శాతం ధరలు పెంచితే తొలి రోజు 60 కోట్ల రూపాయల వ్యాపారం జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ శాతం 75కి చేరింది. పెరిగిన మద్యం ధరలతో నిన్నటి స్థాయిలో వ్యాపారం జరిగితే రోజులో 100 కోట్లకు పైగా ఆదాయం రావడం ఖాయమని అధికారులు అంచనావేస్తున్నారు.

పెరిగిన మద్యం ధరలపై మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్‌ను అడ్డం పెట్టుకుని రోజుల తరబడి మద్యం దుకాణాలు మూసేసింది చాలక, ఇప్పుడు ధరలు పెంచుతారా? అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. మరికొందరు మందుబాబులు పోరుబాటపడతామంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నారు.

Tags: ap, liquor shop, liquor sales, liquor price hike, increased liquor rates, liquor price hike 75%

Next Story

Most Viewed