విద్యార్థులకు తీవ్ర అస్వస్థత.. ఆందోళనలో తల్లిదండ్రులు

by  |
perninani
X

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో తీవ్ర జ్వరాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగించింది. 14 మంది విద్యార్థులకు తీవ్ర జ్వరం, జలుబుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

విద్యార్థులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గత రెండు రోజులుగా విద్యార్థులు ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురి కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రిలో విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించామని గురుకుల అధికారులు వివరించారు.

ఇకపోతే విద్యార్థులకు తీవ్ర జ్వరం వచ్చిన విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్‌ నివాస్‌తో కలిసి ఆస్పత్రి వెళ్లి వైద్యులతో విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్‌ నివాస్‌ మీడియాతో మాట్లాడుతూ… వైరల్‌ జ్వరాల వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు కరోనా, డెంగీ రిపోర్టుల్లో నెగిటివ్‌ వచ్చిందన్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని స్పష్టం చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించామని కలెక్టర్‌ తెలిపారు.

అస్వస్తత పై నివేదిక ఇవ్వాలి:

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థత పై ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యా, వైద్య శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ క్రమంలోనే మచిలీపట్నంలో జరిగిన ఘటన… పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యార్థుల అస్వస్థతకు గురికావడంపై మంత్రి సురేష్‌ నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.


Next Story