నష్టాల నుంచి లాభాల్లోకి మారిన స్టాక్ మార్కెట్లు!

by  |
నష్టాల నుంచి లాభాల్లోకి మారిన స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం లాభాలను సాధించాయి. గత వారాంతం నష్టాలు, ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనల నేపథ్యంలో ఉదయం భారీ నష్టాలను ఎదుర్కొన్న సూచీలు ఆ తర్వాత కోలుకున్నాయి. అయితే కనిష్ఠ స్థాయిల వల్ల ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడం తో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా రంగాలు మెరుగైన లాభాలను మద్దతుగా నిలిచాయి. ‘ ఒమిక్రాన్ భయాల నుంచి స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో పాటు ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం తో మదుపర్ల సెంటిమెంట్ బలపడినదని విశ్లేషకులు తెలిపారు.

మరోవైపు అంతర్జాతీయంగా వేరియంట్ ఆందోళనలు ఉన్నప్పటికీ దేశీయంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు సిద్ధమవడం, అమెరికా డాలర్ కన్నా రూపాయి కరెన్సీ బలంగా మారడంతో సూచీలు నిలదొక్కుకున్నాయి. కేంద్రం సైతం దేశవ్యాప్తంగా బూస్టర్ డోస్‌పై కీలక ప్రకటన చేయడంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలాడాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 295.93 పాయింట్లు పెరిగి 57,420 వద్ద, నిఫ్టీ 82.50 పాయింట్లు పుంజుకుని 17,086 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫార్మా, ఐటీ, హెల్త్‌కేర్ రంగాలు 1 శాతానికి బలపడగా, మిగిలిన రంగాలు స్థిరంగా కొనసాగాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్, మారుతీ సుజుకి, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, రిలయన్స్ షేర్లు నష్టాలను ఎదుర్కొనగా, మిగిలిన కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. ముఖ్యంగా టెక్ మహీంద్రా, డా రెడ్డీస్, పవర్‌గ్రిడ్, కోటక్ బ్యాంక్, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 74.95 వద్ద ఉంది.


Next Story

Most Viewed