నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

by  |
Sensex
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి నష్టాలను నమోదు చేశాయి. ఇటీవల పరిణామాల కారణంగా ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాలతో సరిపెడుతున్న సూచీలు మరోసారి వారాంతం నష్టాల నుంచి బయటపడలేకపోయాయి. గత మూడు రోజులుగా లాభాలను నమోదు చేస్తున్న స్టాక్ మార్కెట్లకు కరోనా మహమ్మారి కేసులు పెరుగుదలతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతిన్నది. శుక్రవారం ఉదయం ప్రారంభం నుంచే ఊగిసలాటకు గురైన మార్కెట్లు చివరి వరకూ అదే ధోరణిని కొనసాగించాయి. దీనికి తోడు మిడ్-సెషన్ తర్వాత కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి అధికం కావడంతో సూచీలు దిగజారాయి. మదుపర్లలో ఉత్సాహాన్ని కలిగించే అంశాలు లేకపోగా, కరోనా కేసులు పెరుగుదల వారి సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి.

దీంతో రోజంతా ఒడిదుడుకుల అనంతరం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 154.89 పాయింట్లు కోల్పోయి 49,591 వద్ద ముగియగా, నిఫ్టీ 38.95 పాయింట్ల నష్టంతో 14,834 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంకింగ్, రియల్టీ, మెటల్, ఫైనాన్స్ రంగాలు డీలాపడ్డాయి. ఐటీ, మీడియా రంగాలు బలపడ్డాయి. ముఖ్యంగా కరోనా కేసుల కారణంగా టీకా డిమాండ్ అధికం కావడంతో ఫార్మా షేర్లు అధికంగా 3 శాతం పెరిగాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, హిందూస్తాన్ యూనిలీవర్, టెక్ మహీంద్రా, డా రెడ్డీస్, టైటాన్ షేర్లు లాభాలను సాధించగా, బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రా సిమెంట్, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, ఎల్అండ్‌టీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.68 వద్ద ఉంది.


Next Story