స్వల్ప లాభాలతో సరిపెట్టిన మార్కెట్లు!

by  |
స్వల్ప లాభాలతో సరిపెట్టిన మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాలతో సరిపెట్టాయి. వరుసగా లాభాలతో దూసుకెళ్తున్న సూచీలకు అమ్మకాల ఒత్తిడి కారణంగా మిడ్-సెషన్‌కు ముందు నష్టాలు ఎదురయ్యాయి. అనంతరం పుంజుకున్న షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఉదయం ప్రారంభం తర్వాత ఓ దశలో సూచీలు కీలక స్థాయిలను అధిగమించాయి. సెన్సెక్స్ 50 వేల మార్కును, నిఫ్టీ 15 వేల మార్కును దాటినప్పటికీ అనంతరం వెనక్కి తగ్గాయి. ఎఫ్అండ్ఓల ముగింపు కారణంగానే మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయని, దీనికి తోడు కరోనా సంబంధిత పరిణామాలు ఇన్వెస్టర్లలో ఆందోళనను పెంచినట్టు విశ్లేషకులు తెలిపారు.

మరోవైపు మళ్లీ లాక్‌డౌన్ ఉంటుందని భయం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 32.10 పాయింట్ల లాభంతో 49,765 వద్ద ముగియగా, నిఫ్టీ 30.35 పాయింట్లు లాభపడి 14,894 వద్ద ముగిసింది. నిఫ్టీలో మెటల్ 4 శాతానికి పైగా పుంజుకోగా, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, డా రెడ్డీస్ షేర్లు లాభాలను దక్కించుకోగా, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఆటో, ఎల్అండ్‌టీ, ఎస్‌బీఐ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.08 వద్ద ఉంది.


Next Story

Most Viewed