50 వేలను అధిగమించిన సెన్సెక్స్!

by  |
50 వేలను అధిగమించిన సెన్సెక్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి రికార్డుల పరంపరను కొనసాగించాయి. వరుసగా మూడో రోజూ భారీ లాభాలతో దూసుకెళ్లిన బుల్, కేంద్ర బడ్జెట్ ఉత్సాహానికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల అండతో కీలకమైన 50,000 మార్కును దాటింది. ఇటీవల రెండు సెషన్‌లలో 50 వేల మార్కును తాకి వెనక్కి వచ్చిన తర్వాత బుధవారం ఈ మైలురాయిని దాటేసింది. బుధవారం నాటి ర్యాలీలో ఆటో, ఫార్మా, మెటల్ రంగాల షేర్ల మద్ధతుతో సెన్సెక్స్ మళ్లీ 50 వేల మార్కును చేరుకుంది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 458.03 పాయింట్లు ఎగసి 50,255 వద్ద ముగిసింది. నిఫ్టీ 142.10 పాయింట్ల లాభంతో 14,789 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాలు సానుకూలంగా కదలాడాయి. ముఖ్యంగా ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంకులు 2 శాతం పుంజుకోగా, ఆటో, మెటల్, ఎనర్జీ రంగాలు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, డా రెడ్డీస్, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, టెక్ మహీంద్రా, ఎంఅండ్ఎం షేర్లు లాభాలను దక్కించుకోగా, ఆల్ట్రా సిమెంట్, మారుతీ సుజుకి, ఎల్అండ్‌టీ, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.98 వద్ద ఉంది.



Next Story

Most Viewed