కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

by  |
Sensex Falls
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో సోమవారం ట్రేడింగ్ అత్యంత దారుణంగా మదుపర్లను దెబ్బతీసింది. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ పరిణామాలు తీవ్రమవుతున్న సమయంలో బేర్ పంజా విసిరింది. ఈ నేపథ్యంలోనే స్టాక్ మార్కెట్లు నాలుగు నెలల్లో కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. గత కొన్ని వారాలుగా లాభనష్టాల మధ్య కదలాడుతున్న సూచీలు నిన్నటి ట్రేడింగ్‌లో ఒక్కసారిగా కుదేలయ్యాయి. అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా కొవిడ్-19 ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం, రానున్న రోజుల్లో ఇది మరింత వేగంగా వ్యాపిస్తుందనే సంకేతాల మధ్య ఇన్వెస్టర్లు అమ్మకాలకు సిద్ధపడ్డారు. అన్ని రంగాల్లోని షేర్లు అధిక నష్టాలను చూసినప్పటికీ అనూహ్యంగా ఫ్యూచర్ గ్రూప్ షేర్లు గణనీయమైన లాభాలతో పుంజుకోవడం గమనార్హం.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,189.73 పాయింట్లు పడిపోయి 55,822 వద్ద, నిఫ్టీ 371 పాయింట్లు నష్టపోయి 16,614 వద్ద ముగిసింది. నిఫ్టీలో రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 5 శాతం పతనం కాగా, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, ప్రైవేట్ బ్యాంక్, మీడియా, ఫైనాన్స్, ఆటో, బ్యాంకింగ్ రంగాలు 2-4 శాతం మధ్య దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్, డా రెడ్డీస్ షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకోగా, మిగిలిన అన్ని షేర్లు నష్టాలను నమోదు చేసింది. ముఖ్యంగా టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, రిలయన్స్, ఎల్అండ్‌టీ, టెక్ మహీంద్రా, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.87 వద్ద ఉంది.

రూ. 6 లక్షల కోట్లు నష్టపోయిన మదుపర్లు..

సోమవారం నాటి ట్రేడింగ్‌లో ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో, మెటల్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు మార్కెట్ల నష్టాలను లీడ్ చేశాయి. పెట్టుబడిదారులు కరోనా భయంలో ఉండటంతో బీఎస్ఈ లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాప్ రూ. 6.81 లక్షల కోట్లను కోల్పోయి రూ. 252.55 లక్షల కోట్లకు తగ్గింది.


Next Story

Most Viewed