ఆ దేశాల్లోకి ఇండియన్స్‌కు నో ఎంట్రీ

by  |
ఆ దేశాల్లోకి ఇండియన్స్‌కు నో ఎంట్రీ
X

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో భారత్ అంటేనే ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. వేగంగా వ్యాపిస్తున్న ఇక్కడి ‘డబుల్ మ్యూటెంట్’ వైరస్‌.. ఆయా దేశాల్లో పాకకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే భారత్ నుంచి విమాన రాకపోకలను నిషేధిస్తున్నాయి. ఇప్పటికే పలు బ్రిటన్, యూఏఈ సహా పలుద దేశాలు భారత్ నుంచి రాకపోకలపై నిషేధం విధించగా ఆ జాబితాలో తాజాగా, కువైట్ చేరింది. భారత్‌లో కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో విమాన రాకపోకలపై ఆ దేశం నిషేధం విధించింది. శనివారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. భారత్ నుంచి నేరుగా, లేదా ఇతర దేశాల గుండా కువైట్‌లో ప్రవేశించరాదని ఆ దేశ విమానయానశాఖ స్పష్టం చేసింది. అయితే, నిషేధం ఎప్పటివరకు అమలవుతుందో అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు.

ఇరాన్ సైతం..

ఇరాన్ సైతం భారత్, పాకిస్థాన్ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించింది. ఈ నిబంధనలు ఆదివారం రాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ‘ఇంగ్లిష్, బ్రెజిలియన్ వైరస్‌ల కన్నా ఇండియన్ వైరస్ చాలా ప్రమాదకరమైన’దని కువైట్ అధ్యక్షుడు హాసన్ రౌహానీ తెలిపారు.

యూఏఈ..

కొవిడ్ విజృంభణ నేపథ్యంలో కార్గో విమానాలు మినహా భారత్ నుంచి వచ్చే ఫ్లైట్స్ అన్నింటిపైనా యూఏఈ నిషేధం విధించింది. శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలు 10రోజులపాటు కొనసాగనున్నాయి. పది రోజుల తర్వాతి పరిస్థితులపై సమీక్షించిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఈ నిబంధనల నుంచి యూఏఈ పౌరులు, దౌత్యవేత్తలు, అధికారిక ప్రతినిధులకు మినహాయింపునిచ్చింది.

ఇండోనేషియా, ఫ్రాన్స్..

చివరి 14రోజులు భారత్‌లో ప్రయాణించినవారికి ఇండోనేషియా ప్రభుత్వం విజాలు మంజూరు చేయడం లేదు. అలాగే, ఫ్రాన్స్ సైతం భారత్ సహా బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, సౌతాఫ్రికా దేశాల విమానాలపై నిషేధం విధించింది.

యూఎస్, యూకే..

అగ్రరాజ్యం అమెరికా భారత విమానాలపై నిషేధం విధించలేదు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికన్స్ భారత్‌లో పర్యటించకూడదని ఆ దేశ పౌరులకు సూచనలు చేసింది. బ్రిటన్‌లో ఇటీవలే 103 ఇండియన్ వేరియంట్ కేసులు వెలుగు చూడటంతో భారత్‌ను ఆ దేశం కొవిడ్-19 ట్రావెల్ రెడ్ లిస్ట్‌లో చేర్చింది. భారత్ నుంచి ప్రయాణాలపై నిషేధం విధించింది. భారత్ నుంచి వచ్చే యూకే, ఐర్లాండ్ పౌరులకు మాత్రం మినహాయింపునిచ్చింది. అయితే, యూకేలోని వచ్చిన వెంటనే 10రోజుల హోటల్ క్వారంటైన్ నిబంధన విధించింది.

ఇదే బాటలో హాంకాంగ్, సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియా

పై దేశాలతోపాటు హాంకాంగ్, సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు సైతం భారత ప్రయాణికులపై నిషేధం విధించాయి. కొద్దిరోజుల క్రితం ముంబై నుంచి వెళ్లిన హాకాంగ్ వెళ్లిన ఫ్లైట్‌లో 50మంది ప్రయాణికులకు పాజిటివ్‌గా తేలింది. దీంతో భారత్ విమానాల రాకపోకలను హాంకాంగ్ బ్యాన్ చేసింది. ఏప్రిల్ 20 నుంచి మే 2దాకా ఈ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. కెనడా ప్రభుత్వం సైతం భారత్, పాకిస్థాన్‌ల నుంచి వచ్చే విమానాలపై 30రోజులపాటు నిషేధం విధించింది.


Next Story