రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ ఫ్యామిలీ దుర్మరణం

by  |
రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ ఫ్యామిలీ దుర్మరణం
X

దిశ, హాలియా: నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ దంపతులు, పిల్లలు మృతిచెందారు. ఎస్ఐ కొండల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం తెప్పలమడుగు సర్పంచ్ తరి శ్రీనివాస్, భార్య తరి విజయ, వారి పిల్లలు కుమారుడు కుమార్తె నలుగురు బైక్ పై నిడమనూరు మండలం ముప్పారంలోని అత్తారింటికి వెళ్లారు. అదే గ్రామంలోని ఓ తోటలో పుచ్చకాయల లోడును టాటాఏస్ వాహనంలో నింపి, స్వగ్రామానికి పంపించారు. ఆటో వెనుకాలే శ్రీనివాస్ తన భార్య, ఇద్దరు పిల్లలతో బైక్ పై తెప్పలమడుగుకు బయలుదేరారు.

సరిగ్గా నిడమనూరు మండల కేంద్రానికి రాగానే రేషన్ బియ్యం లోడుతో వెళుతున్న లారీ,టాటాఏస్ వాహనాన్ని ఢీకొట్టి, సర్పంచ్ కుటుంబం ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనంపైకి మృత్యశకటంలా దూసుకుపోయింది. ఈ ఘోర ప్రమాదంలో తరి శ్రీనివాస్(34), ఆయన భార్య విజయ(30) కుమార్తె శ్రీవిద్య (5) కుమారుడు కన్నయ్య (3) దుర్మరణం చెందారు. టాాటాఏస్ డ్రైవర్ కు తీవ్రగాయాలు కావడంతో మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు, హాలియా సీఐ వీర రాఘవులు, నిడమనూరు ఎస్ఐ కొండల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed