ఇసుక మాఫియా గ్యాంగ్ హల్‌చల్.. అడ్డొచ్చాడని కత్తులతో దాడి

by  |
ఇసుక మాఫియా గ్యాంగ్ హల్‌చల్.. అడ్డొచ్చాడని కత్తులతో దాడి
X

దిశ, జడ్చర్ల : మహబూబ్‌నగర్ జిల్లాలో మరోసారి ఇసుక మాఫియా గ్యాంగ్ రెచ్చిపోయారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక ఇసుక మాఫియా గ్యాంగ్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

పూర్తి వివరాళ్లోకి వెళితే..

మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వాడ్యాల సమీపంలోని దుందుబీ నది నుంచి గత కొన్నిరోజులుగా పలువురు అక్రమార్కులు రాత్రివేళ ఇసుక తరలిస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా డంప్‌లు నిల్వలు చేసుకొని హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో ఈ అక్రమ రవాణాను గ్రామ యువకులు అడ్డుకున్నారు. వీరి మధ్య పలుమార్లు వాగ్వాదం కూడా జరిగింది. అయినా, అక్రమ ఇసుక తరలింపు ఆగక పోవడంతో గత అర్ధరాత్రి వాడ్యాల గ్రామానికి చెందిన మధు అనే యువకుడు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నాడు. దీంతో రెచ్చిపోయిన ఇసుక మాఫియా గ్యాంగ్ (బిర్లా రమేష్, బిర్లా రామకృష్ణ, బెల్లా భీమయ్య, శ్రీశైలం, శ్రీను) కులం పేరుతో దూషిస్తూ కత్తులతో దాడి చేశారు. నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడిన మధు అక్కడే కుప్పకూలిపోయాడు. ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. బాధితుడిని 108 అంబులెన్సులో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.

గతంలో కలెక్టర్‌కు చెప్పినా అంతే..

కాగా, గతంలో తమ గ్రామం నుండి ఇసుకను తరలించవద్దని తద్వారా భూగర్భజలాలు అడుగంటి, బోరుబావులు ఎండి పోతాయాని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దీని కారణంగా పంటలపై ఆధారపడ్డ రైతులకు జీవనాధారం లేకుండా పోతుందని.. జిల్లా కలెక్టర్, ఎస్సీ ఎస్టీ కమిషన్‌లకు ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ స్యాండ్ మాఫియాకు అడ్డుకట్ట వేయలేదని గ్రామస్తులు వాపోతున్నారు. తాజాగా, ఈ రోజు జరిగిన ఘటనపై మాత్రం అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, హత్యాయత్నం కేసు నమోదు చేసి బాధితుడికి న్యాయం చేయాలని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పూర్తి వివరాలు ఇవ్వండి: ఆర్డీవో

జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆదేశాల మేరకు ఆర్డీఓ పద్మశ్రీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం బెజ్జూర్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించారు. నదుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న గ్యాంగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. ఇటువంటి వారిపై చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామన్నారు. ఇప్పటివరకు ఎంతమంది ఇసుక తరలిస్తూ పట్టుబడ్డారో పూర్తి వివరాలను అందించాలని స్థానిక తహసీల్దార్‌ను ఆర్డీవో ఆదేశించారు.


Next Story

Most Viewed