నీటిలో మునిగిపోతున్నా… స్పందన లేదు

by  |
నీటిలో మునిగిపోతున్నా… స్పందన లేదు
X

దిశ, కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజ్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఆదివారం మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు సందర్శించారు. మంథని మండలం మల్లారం గ్రామ సమీపంలోనే మానేరు నది గోదావరిలో కలుస్తుండడంతో అన్నారం బ్యారేజ్ బ్యాక్ వాటర్‌తో పాటు మానేరు నది నీరు కూడా ఇక్కడ కలుస్తున్నాయని, రైతులు శ్రీధర్ బాబుకు వివరించారు. దీంతో తమ పంటలన్నీ ముంపునకు గురవుతున్నాయని తెలిపారు.

దాదాపు 500 ఎకరాల్లో పంటలన్నీ నీట మునిగిపోతున్నాయని పలుమార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తమ పంట పొలాలన్నీ మునిగిపోవడంతో రెండేళ్లుగా సాగు చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని, దీంతో తమ కుటుంబాలను పోషించడం కూడా కష్టంగా మారిందని రైతులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ…

ప్రభుత్వం పరిహారం అందించకపోవడం అన్యాయమన్నారు. ఏటా రెండు పంటలు పండే మల్లారం గ్రామ పొలాలన్నీ నీట మునిగిపోయినా, రైతుల గురించి పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరివాహక ప్రాంత రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే చొరవ చూపించాలని డిమాండ్ చేశారు. బాధిత రైతులకు పరిహారం అందించడంతో పాటు శాశ్వత పరిష్కారం కనుగొనాలని శ్రీధర్ బాబు కోరారు. ఈ ప్రాంతంలోని నీరు, ఇసుక తదితర సహజ వనరులను తీసుకెళ్తున్నా ప్రభుత్వం ఇక్కడి రైతులకు మాత్రం తీరని అన్యాయం చేస్తోందని విమర్శించారు.

Next Story