క్రీడలు ప్రారంభిస్తాం.. కానీ బాధ్యత మాది కాదు..!

by  |
క్రీడలు ప్రారంభిస్తాం.. కానీ బాధ్యత మాది కాదు..!
X

దిశ, స్పోర్ట్స్: దేశంలో క్రీడల అభివృద్ధికి పాటుపడాల్సిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. క్రీడాకారులకు అండగా ఉండాల్సిన సంస్థే.. వారి పర్యవేక్షణ బాధ్యతల నుంచి దూరంగా ఉంటోంది. దీనికి తాజాగా వాళ్లు వెలువరించి స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ) నిదర్శనం. ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా స్తంభించిపోయింది. క్రీడలు కూడా ఏవీ జరగడం లేదు. క్రీడాకారులు టోర్నీలకు, శిక్షణ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇలాగే కొనసాగితే దేశంలో క్రీడా వ్యవస్థ నిర్విర్యమై పోతుందని గ్రహించిన శాయ్ ఒకడుగు ముందు వేసింది. ఇంత వరకు బాగానే ఉంది. కాని ఎస్‌వోపీలో పెట్టిన ఒక నిబంధన క్రీడాకారులను ఆందోళనకు గురి చేస్తోంది. ‘ఆటలు ఆడే సమయంలో గానీ, శిక్షణ సమయంలోగానీ క్రీడాకారుల ఆరోగ్యాలకు సంబంధించి శాయ్ బాధ్యత వహించదని.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని క్రీడాకారులే ఒక ఎన్‌వోసీని శాయ్‌కు ఇవ్వాలి’ అని నిబంధన పెట్టింది. శాయ్ తరపున ఆడే క్రీడాకారుల రక్షణకు అది ఎందుకు బాధ్యత వహించదని క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా నాన్ – కాంటాక్ట్, సెమీ కాంటాక్ట్, ఫుల్ కాంటాక్ట్, వాటర్ స్పోర్ట్స్ అనే విభాగాలుగా క్రీడలను విభజించింది. అందరికీ ఒకే రకమైన నిబంధనలు విధించింది. కరోనా సంక్షోభ సమయంలో ఆటగాళ్లు వారి సొంత రక్షణ తీసుకుంటారు. కానీ ప్రయాణాలు, శిక్షణ శిబిరాలు, ఇతర ప్రాంతాల్లో ఆటలు ఆడే సమయంలో శాయ్ ఎందుకు బాధ్యత తీసుకోదని ప్రశ్నిస్తున్నారు. ఆటలను దశల వారీగా ప్రారంభించడం మంచిదే అయినా క్రీడాకారుల పూర్తి బాధ్యతను కూడా శాయ్ తీసుకోవాలని ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై శాయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Next Story

Most Viewed