RT-PCR పరీక్ష తప్పనిసరి..

by  |
RT-PCR పరీక్ష తప్పనిసరి..
X

దిశ, న్యూస్ బ్యూరో: రాపిడ్ యాంటీజెన్ టెస్టులో నెగెటివ్ వచ్చినా కరోనా లక్షణాలు ఉన్నవారికి తప్పనిసరిగా ఆర్‌టీ-పీసీఆర్ విధానంలో తిరిగి కరోనా నిర్ధారణ పరీక్ష చేయాల్సిందేనని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఆరు నెలల కరోనా అనుభవం ఎన్నో పాఠాలు నేర్పిందని అన్నారు. వైరస్‌కు భయపడినంతకాలం మనం కూడా భయం భయంగా బతకాల్సి వస్తుందన్నారు. ఆ భయాన్ని వదులుకుంటే కరోనాపై విజయం సాధించవచ్చని తెలిసిందన్నారు. వైరస్ బారిన పడినప్పటికీ 99% మంది బయట పడిన అనుభవాన్ని చూస్తే, కరోనాకు మనిషిని చంపే శక్తి లేదని రూఢీ అయిందన్నారు.

నగరంలోని ఎస్‌ఆర్ నగర్ కుటుంబ సంక్షేమ శాఖ ఇన్‌స్టిట్యూట్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 500 మంది ఏఎన్ఎం కార్యకర్తలు, 22 వేల మంది ఆశా వర్కర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడుతూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా రాష్ట్రంలో ప్రవేశించిన తొలి రోజుల్లో ప్రజలు చాలా భయపడేవారని, ఇప్పుడు ప్రతీ ఇంట్లోకి వైరస్ వచ్చిందనే అభిప్రాయంతో ఉన్నారని అన్నారు. ఏఎన్ఎం కార్యకర్తలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది కంటిమీద కునుకు లేకుండా నిబద్ధతతో పనిచేస్తున్నారని, వారు ప్రజల్లో ఇప్పటివరకు కల్పించిన అవగాహనతోపాటు ఇకపైన మరింతగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నెగెటివ్ వచ్చిందనే తాత్కాలిక సంతోషం మంచిది కాదని, వైరస్ పూర్తిగా పారిపోయేంత వరకు ఇదే స్ఫూర్తిని ప్రదర్శించాలని, ప్రజలను ఆ దిశగా చైతన్యపర్చాలని మంత్రి సూచించారు.

కరోనాకు ప్రపంచవ్యాప్తంగా ఒకే తరహా చికిత్స ఉందని, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులు అదే చికిత్సను అందజేస్తాయని మంత్రి పేర్కొన్నారు. అనవసరంగా ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులకు పోయి డబ్బులు వృధా చేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రాథమికస్థాయిలోనే వైరస్‌ను గుర్తించగలిగితే వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. కొత్తవారికి అంటించే ప్రమాదాన్ని నివారించవచ్చన్నారు. ప్రాణాలను కూడా కాపాడవచ్చన్నారు.ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు చేయాల్సిన పని అదేనన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇప్పుడు ప్లాస్మా చికిత్స అందుబాటులోకి వచ్చిందన్నారు.

ప్రజల భాగస్వామ్యంతో మహమ్మారిని ఎదుర్కోగలం అని ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో చెప్పారని గుర్తుచేశారు. అంటువ్యాధులను కరోనా అనుకుని టయపడే అవకాశం వీలైనంత తొందరగా కరోనా నిర్ధారణ పరీక్ష చేయడం ద్వారా భయాలను పోగొట్టడంతోపాటు వైరస్ వ్యాప్తిని నివారించవచ్చని సూచించారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల వేతనాల పెంపు గురించి ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత నిర్ణయం జరుగుతుందని హామీ ఇచ్చారు. త్వరలోనే ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో ప్రత్యేకంగా సమావేశమవుతానని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed