మొండెం నుంచి తల వేరుచేసి.. రౌడీషీటర్ దారుణహత్య

by  |
మొండెం నుంచి తల వేరుచేసి.. రౌడీషీటర్ దారుణహత్య
X

దిశ, మెదక్: పాతకక్షలతో దొంగ‌నోట్ల చలామణి కేసుల్లో ప్రధాన నిందితుడు, రౌడీషీటర్ ఎల్లం‌గౌడ్ గురువారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామ శివారులో అతణ్ని ప్రత్యర్థులు కిరాతకంగా హత్యచేశారు. తల, కుడి చేయిని నరికి మొండెం నుంచి వేరు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం సిద్దిపేట మండలం ఇమామ్‌బాద్‎కు చెందిన అంబటి ఎల్లంగౌడ్ దొంగనోట్ల చలామణి చేసేవాడు. అతడిపై తెలుగు రాష్ట్రాల్లో 16, కర్ణాటక‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. అతణ్ని పట్టుకోవడానికి షామీర్‌పేట పోలీసులు 2014లో డెకాయిట్ ఆపరేషన్ నిర్వహించారు. దొంగనోట్ల కోసం వచ్చినట్టు ఎల్లంగౌడ్‌ ముఠాను పోలీసులు కలిశారు. విషయం పసిగట్టిన ముఠా అక్కడి నుంచి పరార్ కావడానికి ప్రయత్నించింది. అడ్డు వచ్చిన కానిస్టేబుల్‌ను ఎల్లంగౌడ్ కాల్చి చంపాడు. ఎదురుకాల్పుల్లో ఈ ముఠా సభ్యుడు ఒకరు హతమయ్యారు. తీవ్రంగా గాయపడిన ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన అనంతరం ఎల్లంపై అప్పటి సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. ఆ సమయంలో ఓ నాయకుడి సహకారంతో న్యాయస్థానంలో లొంగిపోయాడు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు.

బెయిల్‌పై విడుదలైనప్పటి నుంచి ఎల్లంగౌడ్‌ను హత్యచేయడానికి అతని ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు. పలుమార్లు దాడిచేయగా త్రుటిలో తప్పించుకున్నాడు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న ఎల్లంను గురువారం అర్ధరాత్రి ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేశారు. వేట కొడవళ్లు, గొడ్డళ్లతో నరికారు. మొండెం నుంచి తల, కుడిచేయిని వేరు చేశారు. అయితే, ముగ్గురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. ఎల్లంను తామే హత్య చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం. లొంగిపోయిన వారిలో దొంగనోట్ల చలామణిలో భాగస్వామి అయిన తడకపల్లి వెంకట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Tags: crime, Rowdy sheeter, Yellam Goud, killed, old factions, siddipet


Next Story