రూరల్ ఏరియాల్లో తగ్గిన వ్యాక్సినేషన్..

by  |
రూరల్ ఏరియాల్లో తగ్గిన వ్యాక్సినేషన్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ ప్రాంతాల కంటే రూరల్ ఏరియాల్లో వ్యాక్సినేషన్ మందగిస్తోంది. వైద్యారోగ్యశాఖ గణాంకాల ప్రకారం ఈ నెల 7వ తేదిన అర్బన్‌లో 63,936 మంది టీకాలు తీసుకోగా, రూరల్‌లో కేవలం 41,508కి మాత్రమే వ్యాక్సిన్ వేసుకున్నారు. అదే విధంగా 8వ తేదిన అర్బన్‌లో 7,949 మంది, రూరల్‌లో కేవలం 2,252 మందికి పొందారు. 9న అర్బన్ లో 55,297, రూరల్ లో 54,647 మందికి టీకా ఇచ్చారు. 10న అర్బన్ లో 62,868, రూరల్ లో 43,107 మందికి టీకాలు ఇచ్చారు. 11న అర్బన్ లో 31,894, రూరల్ లో కేవలం 5,968 మందికి డోసులు పంపిణీ చేశారు. 12న అర్బన్ లో 78,780, రూరల్ లో 53,140 మందికి టీకాలు ఇచ్చినట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కన్నారు.

అయితే టీకాపై అవగాహన లేక, కోవిన్‌లో నమోదు చేసుకునేందుకు ఇంటర్నెట్ సౌకర్యం లేకనే రూరల్‌లో టీకా పంపిణీ తగ్గుతుంది. ఎప్పటికప్పుడు అవగాహన చేయాల్సిన అధికారులు కూడా ఆ దిశగా అడుగులు వేయడం లేదు. స్పాట్ రిజిస్ర్టేషన్ ద్వారా టీకా పంపిణీ చేస్తున్న ప్రాంతాల్లో కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ, కోవిన్ పద్ధతిలో ఇస్తున్న జిల్లాల్లోని ప్రజలు టీకా పొందేందుకు ముందుకు రావడం లేదని స్వయంగా హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో కరోనా కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి.

అయితే జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసినట్లు గ్రామీణ ప్రాంతాల్లోనూ మొబైల్ వాహనాలు ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. పీహెచ్ సీలతో పాటు ఈ వాహనాలను అందుబాటులోకి తేవడం వలన టీకా పంపిణీ మరింత వేగవంతం కానుంది. వీటి ద్వారా మార్కెట్లలో ఉండే జనాలతో పాటు రైతులు, వ్యవసాయ కూలీలు, చిరు వ్యాపారులకు ఎక్కడికక్కడ వ్యాక్సిన్ వేస్తేనే కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. లేదంటే కేంద్రం సూచిస్తున్నట్లుగా ఒక వేళ థర్డ్ వేవ్ వస్తే గ్రామాల్లోని ప్రజలు వైరస్ దాడిని తట్టుకోవడం కష్టమని డాక్టర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తద్వారా వారంతా ఆరోగ్యంతో పాటు ఆర్ధికంగానూ నష్టపోవాల్సిన వస్తుందని వివరిస్తున్నారు.

టీకాల్లో మహిళలు వెనకంజ…

టీకా పొందేందుకు పురుషులు కంటే మహిళలు వెనుకంజ వేస్తున్నట్లు ఆరోగ్యశాఖ గణాంకాలను పరిశీలిస్తే అర్థం అవుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 82,93,632 మంది పురుషులు, 77,39,354 మంది స్ర్తీలు వ్యాక్సిన్ పొందారు. వీరిలో 60 ఏళ్ల పై బడిన వారు 32,43,978 మంది, 45 నుంచి 60 మధ్యస్కుల్లో 54,63,417 మంది, 18 నుంచి 44 మధ్యస్థుల్లో 73,49,354 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరందరికీ 1,27,07,200 కోవిషీల్డ్, 32,48,976 కోవాగ్జిన్, 1,00,573 స్పుత్నిక్ టీకాలు పంపిణీ చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లోని మహిళలు టీకా పై అనేక అపోహలు కలిగి ఉన్నారు. ముఖ్యంగా రూరల్ ఏరియాల్లోని మహిళలు వ్యాక్సిన్ వేసుకోవడం లేదు.

వాస్తవానికి దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలు కలిగి ఉన్న వారే మొట్ట మొదటి ప్రాధాన్యతలో వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) సంస్థలు సూచించాయి. గ్రామీణ ప్రజలకు ఈ విషయంపై అవగాహన లేక టీకా పొందేందుకు వెనకడుగు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో శుక్రవారం మరో 1,81,881 మంది టీకాలు పొందారు. వీరిలో 1,19,290 మంది ఫస్ట్, 62,591 మంది సెకండ్ డోసు తీసుకున్నారు.

గడిచిన వారంలో అర్బన్ వర్సెస్ రూరల్ వ్యాక్సినేషన్ ట్రెండ్ ఇలా..

తేది అర్బన్ రూరల్
12 78,780 53,140
11 31,894 5,968
10 62,868 43,107
09 55,297 54,647
08 7,949 2,252
07 63,936 41,508

Next Story

Most Viewed