రికార్డు స్థాయిలో పెరిగిన భారత ఎగుమతులు!

by  |
exports
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది జూలైలో భారత ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగాయి. పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువుల మద్దతుతో ఎగుమతులు 47.9 శాతంతో భారీగా పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడించింది. మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. జూలైలో రూ. 2.61 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు నమోదయ్యాయి. గతేడాది జులైతో పోలిస్తే ఎగుమతులు 34 శాతం అధికమని గణాంకాలు తెలిపాయి. దిగుమతులు సైతం అత్యధికంగా 59.38 శాతం పెరిగి రూ. 3.45 లక్షల కోట్లుగా ఉన్నాయి. దీంతో భారత వాణిజ్య లోటు రూ. 83.51 వేల కోట్లుగా నమోదైంది. భారత మొత్తం ఎగుమతుల్లో పెట్రోలియం, ఇంజనీరింగ్ వస్తువులు, ఆభరణాలకు పెరిగిన డిమాండ్ కారణంగా ఎగుమతులు భారీగా వృద్ధి సాధించాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇదే సమయంలో బియ్యం, మాంసం, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులు భారీగా క్షీణించాయని వివరించింది. 2021-22 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి నాలుగు నెలల్లో భారత ఎగుమతులు రూ. 9.70 లక్షల కోట్లుగా ఉన్నాయని, ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 73.8 శాతం పెరిగాయని గణాంకాలు తెలిపాయి. జులై నెలలో నమోదైన రికార్డు ఎగుమతులు గత తొమ్మిదేళ్లలో లేనంత అత్యధిక ఎగుమతులని భారత ఎగుమతుల సమాఖ్య(ఎఫ్ఐఈఓ) అధ్యక్షుడు శక్తివేల్ అన్నారు. అమెరికా, యూఏఈ, బెల్జియం దేశాలు అత్యధిక ఎగుమతుల జాబితాలో ఉండగా, యూఏఈ, ఇరాక్, స్విట్జర్లాండ్ నుంచి దిగుమతులు అత్యధికంగా నమోదయ్యాయి. ముడి చమురు, బంగారం, విలువైన రత్నాలు, కూరగాయల నూనెలు అత్యధికంగా దిగుమతి అయిన వస్తువుల జాబితాలో ఉన్నాయి.



Next Story

Most Viewed