తెలంగాణలో కొనసాగుతున్న మాంద్యం

by  |
తెలంగాణలో కొనసాగుతున్న మాంద్యం
X

– ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లలో వృద్ధి 6 శాతమే
దిశ, న్యూస్‌బ్యూరో : దేశంతో పాటు తెలంగాణలోనూ మాంద్యం కొనసాగుతోంది. 2019-20 బడ్జెట్‌‌లో రాబడుల అంచనా 1 లక్షా 13 వేల కోట్లను రాష్ట్రం ఈ ఏడాది అందుకునేలా లేదు. అప్పులు మాత్రం ఈ ఏడాది అంచనాలను అప్పుడే మించిపోయి 109.56 శాతానికి చేరాయి. బడ్జెట్‌లో ఈ ఏడాది అప్పుల టార్గెట్ 24 వేల కోట్లుగా చూపిస్తే, ఆర్థిక సంవత్సరం రెండు నెలలు ఉందనగానే 2020 జనవరి 31 నాటికి ఈ సంఖ్య కాస్త 26 వేల 383 కోట్లకు చేరింది. కాగా జనవరి 31 నాటికి పన్నులు, పన్నేతర ఆదాయం కలిపి ఇప్పటికి 75 శాతం అంటే 89 వేల కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే ఖజానాకు చేరింది. ఇది గత సంవత్సరం వసూళ్ల శాతంతో పోలిస్తే బెటర్‌గానే ఉన్నప్పటికీ, ఈ సంవత్సరం పూర్తి బడ్జెట్ అంచనాల్లోనే ప్రభుత్వం భారీ స్థాయిలో కోత విధించడం తెలిసిందే. జనవరి 31 నాటికి రాష్ట్రంలో వివిధ రకాల పన్ను వసూళ్లు..గత సంవత్సరంతో పోలిస్తే బడ్జెట్ అంచనాల్లో 5 శాతం బెటర్‌గా ఉన్నాయి. మొత్తం 89 వేల కోట్ల రూపాయల పన్ను రాబడుల్లో 75 శాతం అంటే 67574 కోట్ల రూపాయల పన్ను వసూళ్లు ఇప్పటికి జరిగాయి. ఇక పన్నేతర వసూళ్లు ఈ ఏడాది బడ్జెట్‌లో 15 వేల 875 కోట్లు టార్గెట్ పెట్టుకుంటే జనవరి 31 నాటికి కేవలం 21 శాతం అంటే 3456 కోట్లు మాత్రమే ఖజానాకు చేరాయి. జనవరి 31 అంటే ఆర్థిక సంవత్సరంలో ఇంకా 2 నెలలు మాత్రమే మిగిలిఉన్నట్లు లెక్క. ఈ రెండు నెలల్లో బడ్జెట్‌లో పెట్టుకున్న లక్ష్యాలు ఏ మేరకు నెరవేరుతాయన్నది వేచి చూడాల్సి ఉంటుంది.

ఫిబ్రవరి జీఎస్టీ కలెక్షన్ల వృద్ధి ఏపీతో పోలిస్తే పేలవం..
తెలంగాణలో ఫిబ్రవరి నెలలో జీఎస్టీ కలెక్షన్లు గతేడాదితో పోలిస్తే 6 శాతం మాత్రమే వృద్ధి చెంది 3667 రూపాయలకు కోట్లకు చేరాయి. ఇదే ఏపీలో పరిశీలిస్తే ఫిబ్రవరి నెల కలెక్షన్లు 23 శాతం పెరిగి 2563 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్‌గా చెప్పుకునే తెలంగాణ రాష్ట్రం మాంద్యం బారి నుంచి ఇప్పట్లో కోలుకునే సూచనలు కనిపించకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

మళ్లీ మాంద్యం పాటేనా..
జీఎస్టీ కలెక్షన్ల వృద్ధి అంతంత మాత్రంగానే ఉండటంతో సీఎం కేసీఆర్ ఈ నెల 8న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో మళ్లీ మాంద్యం పేరెత్తుతారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మాంద్యం పేరు చెప్పి పలు ఎన్నికల హామీలకు ఒక్క రూపాయి విడుదల చేయకుండా పక్కన పెట్టిన సీఎం..ఈ బడ్జెట్‌లోనూ వాటి పేర్లు చేర్చడానికే పరిమితమవుతారని, ఒక్క రూపాయి విడుదల చేసే అవకాశం లేదని ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

Next Story

Most Viewed