గుప్తనిధుల వేటలో చావులకు అసలు కారణమిదే!

by  |
గుప్తనిధుల వేటలో చావులకు అసలు కారణమిదే!
X

దిశ ప్రతినిది, కరీంనగర్: గుప్త నిధులు… ఈ మాట వినగానే చాలా మంది ఆసక్తిగా వింటుంటారు. వీటిని వెతికి తీసి కోటీశ్వరులు కావాలన్న కలల ప్రపంచం కొందరిదైతే… వారి ఆశలను పెట్టుబడిగా మల్చుకుని కోట్లకు పడిగెత్తేవారు మరికొందరు.

గుప్త నిధులంటే..?

పూర్వ కాలంలో రాజులు ధనాగారాన్నంతా కూడా భూమిలో గుట్లల్లో గుహలు తవ్వించి దాచి పెట్టేవారు. అప్పుడు డబ్బులు దాచేందుకు ప్రకృతిలో లభ్యమయ్యే వీటిని మాత్రమే వాడుకునే వారు. ఇకపోతే సామాన్యులు తమ ఇంటి పరిసరాల్లోనో ఇంటి గోడల్లోనే దాచి పెట్టేవారు. రాజుల పాలన కనుమరుగై పోయిన తరువాత అప్పుడు వారు దాచిపెట్టిన నిధుల కోసం ఆరా తీసేవారి సంఖ్య ఎక్కువైంది. ఇటీవల కాలంలో గుప్త నిదులను వేటాడేందుకు ఏర్పడ్డ ముఠాలు అన్నీ ఇన్నీ కావనే చెప్పాలి.

గురువుల వేషం…

గురువు గారు ఫలానా తాంత్రీక విద్యలో ఆరితేరిన వారు ఎలాంటి శక్తుల్ని అయినా ఇట్టే పసిగట్టేసి అక్కడి నుండి నిధిని బయటకు తీసుక వస్తారు అంటూ మాయమాటలు చెప్తూ బుట్టలో పడేసేందుకు కొన్ని టీంలు రంగంలోకి దిగుతాయి. ఈ టీంలు చెప్పే మాయమాటలు నమ్మి కోట్ల రూపాయలు నష్టపోయిన వారు కోకోల్లలనే చెప్పాలి. కొంతమందైతే పూర్వీకుల నుండి వచ్చిన ఆస్థిపాస్థులను కూడా తెగనమ్ముకుని రోడ్డున పడ్డవారూ లేకపోలేదు.

ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది గుప్త నిధుల ఆశలో పడిపోయి ఇంటిల్లిపాదిని వదిలేసి తిరగడమే కాదు సర్కారుకు చెల్లించాల్సిన సొమ్మును కూడా దారి మల్లిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల కరీంనగర్ బల్దియాలో పనిచేసే ఓ ఉద్యోగి నగరవాసుల నుండి వసూలు చేసిన సొమ్మును బల్దియా ఖజానాలో చెల్లించకుండా నిధులు వెలికి తీస్తామని చెప్పే ముఠాకు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇంటా బయటా అప్పుల పాలైన సదరు ఉద్యోగి ఇప్పుడు చేసిన అప్పులు తీర్చడం ఎలా అని తల పట్టుకుంటున్న పరిస్థితి తయారైందని బల్దియాలో బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఇలా మోసపోయిన వారు బయటకు చెప్పలేక చేసిన అప్పులు తీర్చలేక నరకయాతన పడుతున్నారు.

బలులు…

నిధులు వెలికి తీసే ముఠాలు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. తమకు ఎన్నో రకాల శక్తులు ఉన్నాయని చెప్పి రంగంలోకి దిగి ఆ నిధిపై ఉన్న శక్తి ఫలానా ప్రాణాన్ని కోరుతోందని చెప్తారు. అప్పటికే కలల ప్రపంచంలో ఆశల సౌధాలను నిర్మించుకుని మాయా ప్రపంచలో తేలియాడుతున్నవారు ఎలాంటి ప్రాణినైనా బలిఇచ్చేందుకు సాహసిస్తారు. గతంలో పసికందులతో పాటు మనుషులను, జంతువులను బలిచ్చిన సంఘటనలే ఇందుకు ఉదాహారణగా చెప్పవచ్చు. తాజాగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శిథిలావస్థకు చేరిన పురాతన ఇంట్లో గుప్త నిధి కోసం తవ్వకాలు జరుపుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఘటనా స్థలంలో ఓ గొర్రెను కూడా పోలీసులు పట్టుకున్నారు. అక్కడ జంతుబలి ఇచ్చేందుకు తవ్వకాలు జరిపే ముఠా సమాయత్తం అయిందని స్పష్టం అవుతోంది.

అసలేంటి..?

వాస్తవంగా పురాతన కాలంలో రాజులు ఠంకశాల కోసం ప్రత్యేకంగా సైన్యాన్ని నియమించుకునే వారు. వారు భూమిలోపల ప్రత్యేకంగా ఏర్పాటు గుహల్లో ఉంటూ నిధులను దాచిపెట్టేవారు. రాజులు శతృ దేశపు రాజుల చేతికి చిక్కి తాము ఓడిపోతే తమ రాజ్యానికి సంబంధించిన బంగారంతో పాటు అమల్లో ఉండే నగదు మాత్రం చిక్కవద్దని భావించేవారు. ఇందుకోసం అప్పటి రాజులు భూగర్భంలో ఉంచే సైన్యంతో విషముష్టి గింజలు, పాము విషం కలిపి బాయిల్డ్ చేసి భూమిలో పాతిపెట్టేవారు.

గాలి సోకకుండా ఉండే ఈ నిధుల కోసం తవ్వకాలు జరిపినట్టయితే విషవాయువు బయటకు వచ్చి దానిని పీల్చిన వారు చనిపోయే అవకాశం ఉంటుంది. దీంతో తమ రాజ్యపు ధనగారం మాత్రం శతృ రాజులకు దొరికనా వారు తీరని ప్రాణ నష్టాన్ని చవి చూస్తారని ఈ విధంగా చేసేవారు. వేలాది సంవత్సరాల క్రితం భూమిలో పాతిపెట్టిన ఈ ధనాగారాన్ని వెలికి తీయగానే విషం వాయువు రూపంలో బయటకు రావడం దానిని పీల్చడంతో చనిపోవడం జరుగుతోంది. గాలిని పీల్చగానే ప్రాణాలు పోతున్న విషయం చెప్పి అదృశ్య శక్తులు ఉన్నాయని వాటిని పారదొలాలంటే డబ్బులు అవసరం పడతాయంటూ మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేస్తుంటాయి ముఠాలు.

Next Story

Most Viewed