డిసెంబర్ నాటికి ప్రయోగాత్మకంగా డిజిటల్ కరెన్సీ: ఆర్‌బీఐ గవర్నర్!

by  |
RBI Governor Shaktikanta Das
X

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) దశల వారీగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టనున్నట్టు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. అన్ని కుదిరితే ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

అంతర్జాతీయంగా ఇది కొత్త విధానంగా ఉండనున్న నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ప్రణాళికను కలిగి ఉన్నామని, భద్రతతో పాటు దేశ ఆర్థికవ్యవస్థ, ద్రవ్య విధానం, ద్రవ్య లభ్యత లాంటి అంశాలపై ఈ డిజిటల్ కరెన్సీ ప్రభావం ఉంటుందని, కాబట్టి వీటన్నిటిపై అధ్యయనం చేస్తున్నట్టు దాస్ వివరించారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ) అంశంపై ప్రపంచం దృష్టి సారించింది. దీన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించిన దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో లావాదేవీలు నిర్వహిస్తున్న క్రిప్టో కరెన్సీ తరహాలో ఈ సీబీడీసీ ఉండదని, రిజర్వ్ బ్యాంక్ లాంటి సెంట్రల్ బ్యాంకుల హామీ ఉండబోయే చట్టబద్ధమైన కరెన్సీ ఇదని శక్తికాంత దాస్ వివరించారు. అంతేకాకుండా, ఇది పేపర్ కరెన్సీ, నాణెం కాదు. సీబీడీసీ ఫోన్, డిజిటల్ వాలెట్, కంప్యూటర్ నుంచి మాత్రమే వినియోగించే డిజిటల్ కరెన్సీ అని దాస్ వెల్లడించారు.



Next Story

Most Viewed