కర్నూలును న్యాయ రాజధానిగా  ప్రకటించాలి.. రాయలసీమ విద్యార్థి జేఏసీ

by  |
ap jac
X

దిశ, ఏపీ బ్యూరో: రాయలసీమ డిక్లరేషన్‌పై మౌనం వీడాలని, కర్నూలులో న్యాయ రాజధానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వంతో ప్రకటన చేయించాలని డిమాండ్ చేస్తూ.. రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆందోళనకు దిగింది. ఈ క్రమంలో కర్నూలు జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి కర్నూలు త్రిటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు వారు మాట్లాడుతూ.. రాష్ట్ర బీజేపీ పార్టీ రాయలసీమ డిక్లరేషన్ పేరుతో సీమను నయవంచనకు గురిచేస్తోందని ఆరోపించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అనుకూలమని ప్రకటించిన బీజేపీ.. అమరావతి రాజధాని కావాలనడంపై మండిపడ్డారు. బీజేపీకి రాయలసీమ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్‌గా గుర్తించాలన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కర్నూలులో న్యాయ రాజధానికి అనుకూలమని ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు.

విభజన చట్టం హామీ ప్రకారం రాయలసీమకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలులో కేంద్ర న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేయాలని.. రాయలసీమ రెజిమెంట్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఆర్మీలో పని చేయడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిలు మౌనం వీడాలన్నారు. తమతో కలిసి పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధ్యక్షుడు కోస్తా ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టే.. రాష్ట్ర బీజేపీ నాయకులు మొత్తం అమరావతి జపం చేస్తున్నారని రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నేతలు విమర్శించారు.


Next Story

Most Viewed