సంచలన తీర్పు.. హత్యాచార నిందితుడికి ఉరిశిక్ష

by  |
సంచలన తీర్పు.. హత్యాచార నిందితుడికి ఉరిశిక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: చిన్నారి హత్యాచారం కేసులో కృష్ణా జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడికి ఉరి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. 2019 నవంబరులో ద్వారకా అనే బాలికను పెంటయ్య అనే వ్యక్తి కిడ్నాప్ చేసి హత్యాచారం చేశాడు. నేరం రుజువు కావడంతో ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

వివరాల్లోకివెళితే.. జిల్లాలోని గొల్లపూడి నల్లకుంట వద్ద ఏడేళ్ల చిన్నారిపై పెంటయ్య అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్యచేశాడు. బాలిక మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి పారేయాలని అనుకున్నాడు. అయితే, అదే రోజు బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులతో కలిసి వెతికినట్లు నటించాడు. తీరా అతని ప్రవర్తన మీద అనుమానం రావడంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారించి పెంటయ్యను దోషిగా నిర్ధారించారు. భవానీపురం పోలీసులు సాంకేతికపరమైన ఆధారాలు సేకరించడంతో న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు. ఈ కేసులో ఏడేండ్లు , 20యేళ్లు, జీవిత ఖైదు, ఉరిశిక్షను ఇదివరకు విధించినట్లు న్యాయమూర్తి చెప్పారు. కాగా, ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేయాల్సి ఉందని, డిఫెన్స్ వారు కూడా నేరం చేసినట్లు అంగీకరించిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నారాయణరెడ్డి తెలిపారు.

ఉరిశిక్షే సరైన శిక్ష: తండ్రి అనిల్

పెదనాన్న అని పిలిచిన తన కుమార్తెను అత్యంత కిరాతకంగా చంపాడని.. ఆరోజు ఏమీ ఎరుగనట్లుగా తమతో కలిసి పాప కోసం వెతికాడని ద్వారక తండ్రి అనిల్ తెలిపారు. పోలీసుల విచారణలో పెంటయ్య నిందితునిగా తేలిందని.. చిన్నారిని చంపినందుకు ఉరి శిక్షే సరైన శిక్ష అని అన్నారు. తమకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. పెంటయ్య భార్య కూడా తన భర్తకు ఉరి శిక్ష వేయాలని కోరిందని తెలిపారు. ప్రస్తుతం తాము ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామని.. సీఎం జగన్ స్పందించి తమకు ఆర్ధిక సాయం అందించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.



Next Story

Most Viewed