టీఆర్ఎస్‌లో చేరాడని.. ఎంఐఎం నేత కాల్పులు

by  |
టీఆర్ఎస్‌లో చేరాడని.. ఎంఐఎం నేత కాల్పులు
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సొంత సామాజిక వర్గానికి చెందినవారే సహకరించ లేదన్న అనుమానం తీవ్ర గొడవకు దారి తీసింది. ఈ వివాదం కాస్త కత్తులు దూసుకోవడం… కాల్పులు జరపడం వరకూ వెళ్ళింది. వివరాల్లోకి వెళితే… ఆదిలాబాద్ జిల్లా కేంద్రం పురపాలక సంఘం ఎన్నికల సమయంలో మాజీ వైస్ చైర్మన్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ కౌన్సిలర్‌గా పోటీ చేసాడు. మరో వార్డుల్లో తన సతీమణి కూడా పోటీ చేసింది. సొంత ఎంఐఎం పార్టీకి చెందిన కొందరు నేతలు భార్య గెలుపునకు కష్టపడి నప్పటికీ… తనను మాత్రం ఓడించేందుకు కుట్ర చేసినట్లు బయట ప్రచారం జరిగింది. దీనిపై కొంతకాలంగా సొంత పార్టీలోనే వర్గాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం చిన్నపిల్లలు ఆడుకుంటున్న సందర్భంగా చిన్న గొడవ జరిగింది. ఇది కాస్త పెద్ద గొడవకు దారి తీసింది. పాత పగలు మళ్లీ రేగి రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. ప్రత్యర్థి వర్గం కత్తులతో దాడి చేసే ప్రయత్నం చేయగా… ఫారుక్ అహ్మద్ రివాల్వర్తో కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఒకరు సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో… ముఖ్యంగా ఎంఐఎం పార్టీకి బలమైన పట్టు ఉన్న నిర్మల్,బైంసా, ఆదిలాబాద్ పట్టణాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఐజీ నాగిరెడ్డి స్పందన…

తాటిగూడలో జరిగిన కాల్పుల ఘటనపై ఐజీ నాగిరెడ్డి స్పందించారు. ఘటనపై వెంటనే పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. రాజకీయ నేపథ్యంలోనే ఘర్షణలు జరిగాయని స్పష్టం చేశారు. గతంలో అందరూ ఎంఐఎంలో ఉన్నవారే అని, ప్రస్తుతం కొందరు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఈ వివాదం తలెత్తిందని వెల్లడించారు. కాల్పులు జరిపిన ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నామని అన్నారు. కాల్పుల్లో గాయపడ్డ మోహిని అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించామని తెలిపారు. అంతేగాకుండా ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయని, వారిని కూడా ఆస్పత్రికి తరలించినట్టు వెల్లడించారు. అయితే ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫరూక్ తుపాకీతో మొదట రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్టు గుర్తించారు.


Next Story

Most Viewed