ఫ్రెంచ్ ఓపెన్‌లో పీవీ సింధు ముందంజ.. టోర్నీ నుంచి సైనా, శ్రీకాంత్ ఔట్

by  |
ఫ్రెంచ్ ఓపెన్‌లో పీవీ సింధు ముందంజ.. టోర్నీ నుంచి సైనా, శ్రీకాంత్ ఔట్
X

దిశ, స్పోర్ట్స్: పారిస్ వేదికగా జరుగుతున్న యోనెక్స్ ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ముందంజ వేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన జూలీ జాకబ్‌సెన్‌పై 21-15, 21-18 తేడాతో విజయం సాధించింది. జూలీ మొదటి నుంచి ఆటలో గట్టి పోటీ ఇచ్చింది. కానీ, సింధు తన సహజ శైలిలో స్మాష్, డ్రాప్ షాట్లు ఆడుతూ పై చేయి సాధించింది.

మరో మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగింది. జపాన్‌కు చెందిన సయాక టకహాషితో జరిగిన మ్యాచ్‌లో 11-21 తేడాతో తొలి సెట్ కోల్పోయింది. రెండో సెట్‌లో 2-9 తేడాతో వెనుకబడి ఉన్న సమయంలో గాయం కారణంగా తప్పుకున్నది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 21-10, 21-16 తేడాతో హాట్ గ్యూన్‌పై విజయం సాధించాడు. సౌరభ్ వర్మ 22-20, 21-19 తేడాతో గోర్ కొల్హోపై విజయం సాధించి తర్వాతి రౌండ్‌కి వెళ్లాడు. మరో మ్యాచ్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 11-21, 14-21 తేడాతో చౌ టియాన్ చెన్‌పై ఓడిపోయాడు. మరో మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ 18-21, 22-20, 19-21 తేడాతో వరల్డ్ నెంబర్ వన్ కెంటో మోమొటాపై ఓడిపోయాడు. సుదీర్ఘంగా సాగిన ఈ మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ గట్టి పోటీ ఇచ్చాడు. కానీ హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో మోమొటాదే పై చేయి అయ్యింది.

ఇక పారుపల్లి కశ్యప్ 17-21, 21-17, 11-21 తేడాతో బ్రిస్ లావెర్జ్‌పై ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌లో సాత్వీక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి 18-21, 21-17, 21-13 తేడాతో లీ హుయ్-యాంగ్ హ్యూన్ జోడీపై విజయం సాధించారు. తొలి గేమ్ కోల్పోయినా.. ఆ తర్వాత వరుస గేమ్స్‌లో ఆధిపత్యం సాధించి మ్యాచ్ గెలుచుకున్నారు. మరో మ్యాచ్‌లో ధృవ్ కపిల-అర్జున్ జోడి 21-13, 21-12 తేడాతో జాషువా-పాల్ జోడీపై గెలిచి తర్వాతి రౌండ్‌కు చేరుకున్నారు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి జోడి 16-21, 17-21 తేడాతో లీషూ-షిన్‌ జోడీపై ఓటమిపాలయ్యారు. మరో మ్యాచ్‌లో జక్కంపూడి మేఘన-రామ్ పూర్విశ జోడి మ్యాచ్ మధ్యలోనే వైదొలిగారు. మిక్స్‌డ్ డబుల్స్‌‌లో సాత్వీక్ సాయిరాజ్ – అశ్విని పొన్నప్ప జోడి 21-19, 21-15 మాతియాస్-సుర్రోవ్ జోడీపై విజయం సాధించారు.


Next Story

Most Viewed