యాంకర్‌గా పీవీ సింధు..

by  |
యాంకర్‌గా పీవీ సింధు..
X

దిశ, వెబ్‌డెస్క్: తన ఆటతీరుతో.. భారత పతాకాన్ని రెపరెపలాడించింది స్టార్ షట్లర్ పీవీ సింధు. ఇప్పటివరకు గేమ్‌లో తన సత్తా చాటిన ఈ యువక్రీడాకారిణి.. తొలిసారిగా తెరమీద కూడా తన విశ్వరూపాన్ని చూపించబోతుంది. ‘ది ఏ గేమ్​’ పేరుతో తీయనున్న వెబ్​సిరీస్​లో కనిపించబోతున్నట్లు పీవీ సింధు తన ఇన్‌స్టా వేదికగా తెలియజేసింది.

ప్రముఖ స్పోర్ట్స్‌ మార్కెటింగ్‌ సంస్థ బేస్‌లైన్‌ వెంచర్స్‌ నిర్మిస్తోన్న క్రీడలకు సంబంధించిన ‘ది ఏ – గేమ్‌’ వెబ్‌ సిరీస్‌‌లో సింధు యాంకర్‌గా కనిపించనుంది. ఇది మొత్తంగా ఐదు ఎపిసోడ్‌లతో నిర్మితం కానుంది. ఈ కార్యక్రమంలో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, రెజ్లర్‌ సాక్షి మాలిక్‌, షూటర్‌ గగన్‌ నారంగ్‌, లాంగ్‌ జంపర్‌ అంజు బాబీ జార్జ్‌, ఫుట్‌బాలర్‌ బైచుంగ్‌ భూటియా, స్నూకర్‌ – బిలియర్డ్స్‌ స్టార్‌ పంకజ్‌ అద్వానీల క్రీడా జీవితాలను మన ముందుకు తీసుకురానుంది. భారత క్రీడా చరిత్రలో ఈ అథ్లెట్లు ఎలాంటి విజయాలు నమోదు చేశారు. కెరీర్​లో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వాటిని అధిగమించి ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్లగలిగారనే విషయాలను ఇందులో చర్చించనుంది.

‘ఈ షోలో భాగస్వామ్యం కావడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఒత్తిడి సమయంలో దిగ్గజ అథ్లెట్ల ఆలోచనా విధానాన్ని వారి శక్తి సామర్థ్యాల్ని ఈ షో ద్వారా తెలుసుకోవచ్చు’ అని సింధు తెలిపింది. ‘ది ఏ గేమ్’.. యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌‌లో ప్రసారం కానుంది. బేస్‌లైన్‌ వెంచర్స్‌ ఇప్పటికే ‘డబుల్‌ ట్రబుల్‌, ఫినిష్‌ లైన్‌’ పేరిట నిర్మించిన రెండు వెబ్‌ సిరీస్‌లు విజయవంతమయ్యాయి.

Next Story

Most Viewed