పుప్పాలగూడ, ఖానామెట్ భూముల వేలం వాయిదా

by  |
పుప్పాలగూడ, ఖానామెట్ భూముల వేలం వాయిదా
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 27, 28 తేదీల్లో రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని పుప్పాలగూడ‌(గండిపేట మండ‌లం), ఖానామెట్‌(శేరిలింగంప‌ల్లి మండ‌లం) భూముల వేలం వాయిదా వేస్తున్న‌ట్లు టీఎస్ఐఐసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ భూముల వేలంపై ప‌లువురు ఆయా కోర్టుల్లో పిటిష‌న్లు దాఖ‌లు చేసిన నేప‌థ్యంలో వాయిదాకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు పేర్కొంది. కొనుగోలుదారుల‌కు పూర్తి స్థాయిలో భ‌రోసా కలిగించేందుకు కోర్టు కేసులు ప‌రిష్కారం అయిన త‌ర్వాతే వేలం ప్ర‌క్రియ ఉంటుంది. పుప్పాల‌గూడ‌, ఖానామెట్‌లో నిరూప‌యోగంగా ఉన్న 117.29 ఎకరాల ప్రభుత్వ భూములను ఈ–వేలం పద్ధతిలో విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ‌యించగా, రాష్ట్ర పారిశ్రామిక మౌలికవసతుల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఈ ఏడాది ఆగ‌స్టు నెల‌లో నోటిఫికేషన్‌ జారీ చేసింది.

దీని ప్రకారం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌ సర్వే నంబర్‌ 41/14లోని 22.79 ఎకరాల విస్తీర్ణంలోని 9 ప్లాట్లను విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించారు. దీంతో పాటు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలో 325, 326, 327, 328 సర్వే నంబర్లలోని 94.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మరో 26 ప్లాట్లను కూడా వేలం వేసేందుకు నిర్ణ‌యం తీసుకున్నట్లు తెలిపారు.

అసెంబ్లీలో నాలుగు బిల్లులు

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ సమావేశాల రెండో రోజూ పలు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ‘తెలంగాణ హౌజింగ్ బోర్డు బిల్లు’ను ప్రవేశపెట్టనున్నారు. కొండా లక్ష్మణ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ బిల్లును మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తెలంగాణ పంచాయతీరాజ్ బిల్లును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రిసెర్చ్ యూనివర్సిటీ బిల్లును మంత్రి అల్లోల ఇంద్రకర్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఐటీ మరియు పరిశ్రమలశాఖ పురోగతిపై సమీక్షించనున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీఎన్ నర్సింహా చార్యులు ఒక ప్రకటనలో తెలిపారు.



Next Story