టీకా పంపిణీ భేష్

by  |
టీకా పంపిణీ భేష్
X

న్యూఢిల్లీ: వారం వ్యవధిలో టీకా పంపిణీ వేగవంతమవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే వేగాన్ని ఇకముందూ కొనసాగించాలని అధికారులకు సూచించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థల సహకారాన్నీ తీసుకోవాలని అన్నారు. అదే సమయంలో కరోనా టెస్టుల సంఖ్య తగ్గకుండా చూసుకోవాలని చెప్పారు. ఏ ప్రాంతంలోనైనా కరోనా మహమ్మారి వ్యాప్తి, ప్రభావాన్ని పసిగట్టడానికి టెస్టులే సరైన ఆయుధాలని వివరించారు. కాబట్టి, టీకా పంపిణీ వేగంగా నిర్వహించినప్పటికీ రోజువారీగా టెస్టుల సంఖ్య తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొవిన్ పోర్టల్‌పై ఆసక్తి పెరుగుతున్నదని అధికారులు ప్రధానికి వివరించారు.

దీనిపై స్పందిస్తూ ఆసక్తి ప్రదర్శించిన అన్ని దేశాలకు కొవిన్ ప్లాట్‌ఫామ్ రూపంలో సహాయపడటానికి వెనుకాడవద్దని పేర్కొన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ నూతన పాలసీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత టీకా పంపిణీ వేగమందుకున్నది. ఈ తరుణంలో ప్రధానమంత్రి మోడీ ఉన్నతాధికారులతో శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వయసులవారీగా టీకా కవరేజీని, హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, సాధారణ పౌరుల్లో టీకా పంపిణీ వివరాలను అధికారులు ప్రధానికి తెలిపారు. ఆరు రోజుల్లో 3.77 కోట్ల డోసులను పంపిణీ చేశామని చెప్పారు. 128 జిల్లాల్లో 50శాతానికి మించి 45 ఏళ్లు పైబడిన వారికి టీకా వేశామని, 16 జిల్లాల్లో 90శాతం మంది 45+ ఏజ్ గ్రూప్‌వారికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని వివరించారు. సమీప భవిష్యత్‌లో టీకాల ఉత్పత్తి పెంచడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.

Next Story

Most Viewed